ముంబై, జూలై 31: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో జోరుమీదున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు భారీగా నష్టపోయినప్పటికీ విదేశీ మదుపర్లు భారీగా నిధులు కుమ్మరించడంతో సూచీలు మూడు వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. వారాంతపు ట్రేడింగ్లో ఒక దశలో 300 పాయింట్లకు పైగా ఎగబాకిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 166.49 పాయింట్లు అందుకొని తిరిగి 78 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. చివరకు 78,094.64 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 66.45 పాయింట్లు అందుకొని 24,383.60 వద్ద స్థిరపడింది. సూచీల్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతున్నదని, పెరిగిన రాబడులు, వడ్డీరేట్ల పెంపుపై ఉన్న ఆందోళన నేపథ్యంలో మదుపర్లలో జాగ్రత్తకొనసాగినప్పటికీ, సానుకూల వృద్ధి కొనసాగిందని..ఈ పునరుద్ధరణ స్థిరత్వం ప్రధానంగా, ప్రస్తుత అంచనాలను మించి రాణిస్తున్న ప్రస్తుత ఆదాయాల సీజన్పై ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇటీవల కాలంలో భారీగా లాభపడిన ఐటీ రంగ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరిగిందన్నారు.