Viral news : విదేశాల్లో కొందరు భారతీయ పర్యాటకులు (Indian Tourists) ప్రవర్తిస్తున్న తీరు మన దేశ ప్రతిష్ఠను మసకబారుస్తున్నది. వియత్నాం (Viatnam) లోని హో చి మిన్ సిటీ (Ho Chi Minh City) లో ఉన్న ‘బాంబే బైట్స్ (Bombay Bites)’ అనే ఇండియన్ రెస్టారెంట్లో ఒక భారతీయ కుటుంబం (Indian family) సృష్టించిన బీభత్సం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పిల్లలు చేసిన కొంటె చేష్టలతో ఈ వివాదం మొదలై తీవ్ర గొడవకు దారితీసింది.
అసలేం జరిగిందంటే.. రెస్టారెంట్ డైనింగ్ ఏరియాలో ఆ కుటుంబానికి చెందిన పిల్లలు టిష్యూ పేపర్లను ఇష్టమొచ్చినట్లు విసురుతూ రచ్చ చేశారు. అక్కడి సిబ్బంది పిల్లలను కాస్త నియంత్రించాలని వారి తల్లిదండ్రులను మర్యాదగా కోరారు. అయితే దీన్ని అవమానంగా భావించిన ఆ కుటుంబం.. పిల్లలకు మరిన్ని టిష్యూ పేపర్లు ఇచ్చి రెచ్చగొట్టింది. దాంతో రెస్టారెంట్ సిబ్బంది వచ్చి ఇది పద్ధతి కాదు అని చెప్పారు. దాంతో ఆ ఫ్యామిలీ సిబ్బందిపై దాడికి దిగింది. క్షణాల్లోనే ఆ ప్రాంతం పూర్తిగా రణరంగంగా మారిపోయింది.
మొదట పిల్లలు టేబుల్పై ఉన్న ప్లేట్లు, గ్లాసులను నేలపై విసిరి కొట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత వారి తల్లిదండ్రులు మరింత రెచ్చిపోయి కేకలు వేస్తూ మరికొన్ని గ్లాసులను పగలగొట్టారు. అంతటితో ఆగకుండా అక్కడి సిబ్బందిని నెట్టివేస్తూ.. వారిపై భౌతిక దాడికి దిగారు. ఈ ఆకస్మిక పరిణామంతో తీవ్ర ఆందోళనకు గురైన హోటల్ ఉద్యోగినిని ఇతర సిబ్బంది పక్కకు తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన పూర్తి సీసీటీవీ దృశ్యాలను రెస్టారెంట్ యజమాని ఐశ్వర్య ఖన్నా సింగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సదరు కుటుంబం తమ రెస్టారెంట్ ఆస్తికి నష్టం కలిగించడమే కాకుండా సిబ్బందిని ఘోరంగా అవమానించిందని ఐశ్వర్య ఖన్నా ఆరోపించారు. తాము సోషల్ మీడియా ‘ఇన్ఫ్లుయెన్సర్లం’ అని చెప్పుకుంటూ వారి తప్పును కప్పిపుచ్చుకునేందుకు బాధ్యతారహితంగా ప్రవర్తించారని చెప్పారు. రెస్టారెంట్ అనేది పిల్లలు ఆడుకునే ఆటస్థలం కాదని, పబ్లిక్ స్థలాలలో సిబ్బంది పట్ల కనీస గౌరవం చూపించడం అనేది ఎవరికైనా అత్యంత ముఖ్యమని ఆమె స్పష్టంచేశారు.
ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో సదరు భారతీయ కుటుంబంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించాల్సింది పోయి తల్లిదండ్రులే ఇలాంటి దారుణమైన ప్రవర్తనతో వారికి తప్పుడు ఉదాహరణగా నిలిచారని మండిపడుతున్నారు. కనీస పౌర స్ఫూర్తి, విజ్ఞత లేని ఇలాంటి వారివల్లే విదేశాల్లో మిగతా భారతీయులకు కూడా చెడ్డపేరు వస్తోందని మండిపడుతున్నారు.