Khashaba Teaser | భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో దేశానికి మొట్టమొదటి పతకాన్ని అందించిన లెజెండరీ రెజ్లర్ ఖాషాబా దాదాసాహెబ్ జాదవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ ‘ఖాషాబా’. ‘సైరాట్’ వంటి సంచలన సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు నాగ్రాజ్ మంజులే ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో పాటు జియో స్టూడియోస్తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడిని ఇంకా పరిచయం చేయకపోగా తాజాగా చిత్రబృందం మూవీ నుంచి టీజర్ను విడుదల చేసింది.
1952 హెల్సింకి ఒలింపిక్స్లో కుస్తీ పోటీలలో భారతదేశానికి కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన ఖాషాబా జాదవ్.. ఎలాంటి ఆధునిక వసతులు, ఆర్థిక సహాయం లేని రోజుల్లోనే ఒక సామాన్య గ్రామీణ యువకుడిగా ప్రయాణాన్ని ప్రారంభించి అంతర్జాతీయ వేదికపై దేశ జెండాను ఎలా ఎగురవేశారనే స్ఫూర్తిదాయకమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదలైన టీజర్లో మట్టి కుస్తీ నేపథ్యం, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. వాస్తవిక చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించే నాగ్రాజ్ మంజులే ఈ సినిమా బాధ్యతలు చేపట్టడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇక భారతదేశ క్రీడా చరిత్రలో మరుగునపడిపోయిన ఒక గొప్ప వీరుడి కథను నేటి తరానికి పరిచయం చేసేందుకు మరాఠీ, హిందీతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో రానున్న ఈ చిత్రంలో ఖాషాబా పాత్రను ఎవరు పోషిస్తున్నారనే సస్పెన్స్ ప్రస్తుతం ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.