న్యూఢిల్లీ: గత 121 ఏండ్లలో మూడోసారి మార్చిలో భారతావనిలో వేడి వాతావరణం నెలకొందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దేశవ్యాప్తంగా గత నెలలో గరిష్ఠంగా 32.65 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. 1980-2010 మధ్యకాలంలో సాధారణ ఉష్ణోగ్రత 31.24 డిగ్రీలుగా నిలిచింది. 2011 తర్వాత 2021 మార్చి ఉష్ణమాసంగా నిలిచింది. దేశవ్యాప్తంగా కనిష్ట, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదయ్యాయి.
పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు గత నెల రెండోవారంలో క్రమంగా పెరిగాయి. ప్రత్యేకించి రాజస్థాన్, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు ఏరోజుకారోజు పెరుగుతూ వచ్చాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే జెనామని తెలిపారు.
అయితే, గత నెలలో సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం రికార్డు కావడమే ఆందోళన కలిగిస్తున్నదన్నారు. గత నెలలో 45.2 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు.
తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అసోం, మేఘాలయ, జమ్ముకశ్మీర్ మినహా దేశమంతా తక్కువ వర్షపాతం రికార్డయింది. సాధారణంగా మార్చిలో చెదురుమదురుగా ఉరుములు, మెరుపులతో వర్షపు జల్లులు కురుస్తాయి. పశ్చిమ ప్రాంతంలో వరుసగా తలెత్తిన కల్లోల పరిస్థితుల వల్ల ఢిల్లీ, పంజాబ్ వాటి ఇరుగు పొరుగు రీజియన్లలో వేడి వాతావరణం నెలకొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి