న్యూఢిల్లీ: జంతర్మంతర్ వద్ద చోటుచేసుకున్న నిరసనల అనుభవాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనస్సులో ఇంకా తాజాగా ఉన్నాయి. జెన్-జీ విద్యార్థుల ఆందోళన వల్ల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఇప్పుడు మరొక ఆందోళన వీధి పోరాటంగా మారకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఈసారి ఆందోళన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్(ఈబీపీ) కార్యక్రమంపై మొదలైంది. ఈ-20 పెట్రోల్ను తొందరపాటుగా అమలు చేయడాన్ని నిరసిస్తూ సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాలా నేతృత్వంలోని ‘టీమ్ భారత్’ జూలై 31న పార్లమెంట్ సమీపంలో ‘గడ్డీ మార్చ్’ నిర్వహించాలని ప్రణాళిక రచించింది.
నిరసన ప్రదర్శనకు రెండు రోజుల ముందే ‘టీమ్ భారత్’ ప్రతినిధులతో బుధవారం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువులశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఈబీపీ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేయడంపై కొందరు వాహనదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ఇంజిన్లు దెబ్బతింటున్నాయని, మైలేజీ తగ్గుతున్నదని, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 2023కి ముందు తయారైన వాహనాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఇథనాల్ కలుపడానికి, వాహనాలు దెబ్బతినడానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నదనడాన్ని కేంద్రం తోసిపుచ్చినప్పటికీ గతంలోలా కాకుండా ఈసారి ముందే చర్చలు జరిపేందుకు సుముఖత చూపింది.
నిరసనలు అసలు ప్రారంభం కాకముందే కేంద్ర ప్రభుత్వం నిరసనకారులతో చర్చలకు రావడం ఇదే తొలిసారని పూనావాలా అన్నారు. ఈ సమావేశంలో పూనావాలా ప్రత్యక్షంగా లేనప్పటికీ ప్రభుత్వం చూపిన చొరవను, టీమ్ భారత్తో భేటీని సానుకూల అడుగుగా అభివర్ణించారు. “ప్రారంభంలో పెట్రోలియం శాఖ అధికారులతో మాత్రమే జరుగుతుందనుకున్న ఈ చర్చలు ఉన్నతస్థాయి భేటీగా మారాయి. స్వయంగా మంత్రి హర్దీప్సింగ్ పురి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు మేము కృతజ్ఞులం” అని పూనావాలా తెలిపారు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ భేటీలో ఈ-20 బ్లెండింగ్ విధానం అమలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని చర్చించామని అన్నారు.
కల్తీ ఇంధనం వల్లే నష్టం జరుగుతున్నదని, ఇథనాల్ వల్ల కాదని మా టీమ్కు పురి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ మా ప్రశ్న చాలా సరళమైనది. పెట్రోల్ పంపులకు కల్తీ ఇంధనం ఎలా చేరుతున్నది? దానికి ఎవరు బాధ్యులు? జవాబుదారీతనం, తనిఖీలు ఉండాలి కదా అని పూనావాలా ప్రశ్నించారు. జూలై 31న చేపట్టాలనుకున్న మార్చ్పై పునరాలోచించాలని పురి టీమ్ కోరిందని, అంతర్గతంగా చర్చించిన తర్వాతే దీనిపై తమ టీమ్ ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
సమావేశంలో టీమ్ భారత్ ప్రభుత్వం ముందు కొన్ని కచ్చితమైన షరతులను ఉంచింది. 2023 కంటే ముందు తయారైన వాహనాల కోసం ఈ-10 పెట్రోల్ను అందుబాటులో ఉంచాలనేది ప్రధాన డిమాండ్. ఆ వాహనాల్లో చాలావరకు ఈ-20 ఇంధనాన్ని నిరంతరం ఉపయోగించడానికి అనుకూలంగా తయారు కాలేదని చెప్పారు. పెట్రోల్ పంపుల్లో స్వచ్ఛమైన పెట్రోల్(ఈ-0) అందుబాటు ధరలో లభించేలా చూడాలని కూడా గ్రూప్ డిమాండ్ చేసింది. మరొక ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే.. స్వచ్ఛమైన పెట్రోల్తో పోలిస్తే ఈ-20ని 20 శాతం తక్కువ ధరకు విక్రయించాలి. భారత్లో శుద్ధి చేసిన ఇంధనాన్ని దిగుమతి చేసుకునే నేపాల్ వంటి దేశాలు తక్కువ ధరకే పెట్రోల్ను పొందుతుంటే, తక్కువ పెట్రోల్ ఉండే ఇంధనానికి కూడా భారతీయ వినియోగదారులు దాదాపు సమానమైన ధర ఎందుకు చెల్లించాల్సి వస్తున్నదని ఆయన ప్రశ్నించారు. ఈ-20 పూర్తి పాలసీ డాక్యుమెంట్, శాస్త్రీయ అధ్యయనాలను ప్రజల ముందు ఉంచాలని టీమ్ భారత్ కోరింది.