తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులు ఎమోషనల్ సినిమాలు చాలా బాగా తెరకెక్కిస్తారు. వాటితోనే విజయాలు కూడా అందుకుంటారు. ఏడిపించడం అంత ఈజీ కాదు. తెరపై ఎమోషన్ ఎంతో బాగా పండితే కానీ చూసే ప్రేక్షకుడి కంటి నుంచి నీళ్లు రావు. అంత బలమైన ఎమోషన్స్ తెరకెక్కించాలంటే ఆ దర్శకుడిలో చాలా మ్యాటర్ ఉండాలి. అలాంటి విషయం ఉన్న దర్శకుడు శివ నిర్వాణ. ఈయన తొలి రెండు సినిమాలు సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాయి. 2017లో నాని హీరోగా నటించిన నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు శివ నిర్వాణ. ఈ సినిమాలో నానిలోని ఎమోషనల్ కోణం బయటపెట్టాడు దర్శకుడు శివ. ప్రేమ కంటే పెళ్లి గొప్పది అని నిన్ను కోరి సినిమాలో చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా క్లైమాక్స్లో నాని అలా నడుచుకుంటూ వచ్చే సన్నివేశం ఎవరు అంత ఈజీగా మరిచిపోలేరు.
ఇక ఈయన రెండో సినిమా మజిలీ. సమంత, నాగచైతన్య పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి సినిమా ఇది. వాళ్లిద్దరినీ ప్రేక్షకులు ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారో అలాంటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా క్రియేట్ చేశాడు శివ నిర్వాణ. ఈ సినిమా కూడా ప్రేక్షకుల కంటతడి పెట్టించింది. ముఖ్యంగా సమంత పెర్ఫార్మెన్స్కు అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఈయన టక్ జగదీష్ సినిమాతో వస్తున్నాడు. నిన్ను కోరి సినిమా తర్వాత నానితో మరోసారి పని చేస్తున్నాడు.
పోస్టర్స్, టీజర్ చూసిన తర్వాత ఇది మాస్ సినిమా అని అందరూ అనుకున్నారు. కానీ కమర్షియల్ అంశాలతో పాటు ఎమోషన్స్ చాలా ఉండబోతున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హీరో నాని, అతడి అన్నయ్య జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తాయని తెలుస్తుంది. అలాంటి బలమైన ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
టక్ జగదీష్ మాస్ కంటే కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా చేరువ అవుతుందని నమ్ముతున్నాడు శివ నిర్వాణ. ఈ సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతాను అంటున్నాడు. మరి సక్సెస్ ఫుల్ గా మూడోసారి కూడా ఆడియన్స్ను ఏడిపిస్తాడో లేదో చూడాలి. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి