న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: అత్యంత క్లిష్టమైన నిర్ణయాలను తీసుకోవడంతోనే తన రోజూవారీ చర్యలు ప్రారంభమవుతాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ఉద్దేశించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో బుధవారం వర్చువల్ మాధ్యమంగా పాల్గొన్న ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులతో తన అనుభవాలను పంచుకున్నారు. ‘ఉదయం లేవగానే అత్యంత కష్టమైన పనినే ప్రారంభిస్తా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఇది అలవాటుగా మారింది. అధికారులు కూడా నా దృష్టికి ముందుగా క్లిష్టమైన అంశాలనే తీసుకువస్తారు. వాటిపై నిర్ణయాలతో రోజును ప్రారంభించడం నాకు ఇష్టమని వాళ్లకు కూడా తెలుసు’ అని అన్నారు. ‘కష్టమైన పనులను ముందుగా పూర్తిచేస్తే, సులువైన పనులను ఆ తర్వాత తేలిగ్గా పూర్తిచేయవచ్చు’ అని పేర్కొన్నారు. అందరికీ అన్ని సబ్జెక్టులు రావాలని లేదని చెబుతూ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ను ఉదహరించారు. ‘లతకు భూగోళశాస్త్రం అంతగా రాకపోవచ్చు. అయితే ఆమె గొప్ప గాయని. మీకు (విద్యార్థులకు) కొన్ని సబ్జెక్టులు కష్టంగా అనిపిస్తే దాన్ని ఓటమిగా భావించవద్దు. వాటి నుంచి దూరంగా వెళ్లొద్దు’ అని విద్యార్థులకు ధైర్యాన్ని నూరిపోశారు. పరీక్షల పట్ల పిల్లలకు కలిగే భయాల్ని పోగొట్టేందుకు తల్లిదండ్రులు, టీచర్లు కృషిచేయాలని, ఎక్కువ మార్కుల కొరకు ఒత్తిడి తీసుకురావద్దన్నారు. పరీక్షల పట్ల భయాల్ని విద్యార్థులు విడిచిపెట్టాలని, తమను తాము మెరుగుపరుచుకోవడానికి పరీక్షలు ఒక సాధనమని గ్రహించాలని హితవు పలికారు. 2018లో ప్రారంభమైన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం.. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం వర్చువల్ మాధ్యమంగా జరిగింది.
ఇవి కూడా చదవండి..
రాధిక, శరత్కుమార్లకు ఏడాది జైలు
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్