న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఎన్నికల ప్రచారంలో మతం పేరు ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారన్న ఆరోపణపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి ఎన్నికల కమిషన్ (ఈసీ) బుధవారం నోటీసు జారీ చేసింది. 48 గంటల్లో బదులివ్వకపోతే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ముస్లింలు తమ ఓట్లు చీలిపోయేలా వేర్వేరు పార్టీలకు వేయొద్దని, ముస్లింలు అందరూ టీఎంసీకే ఓటు వేయాలని ఓ సభలో మమత కోరారని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. మమతలాగా తాము హిందువులకు పిలుపునిచ్చి ఉంటే తమ పార్టీపై ఈసీ చర్యలు తీసుకొని ఉండేదని బెంగాల్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈసీ ఈ చర్య తీసుకోవడం గమనార్హం.
టీఎంసీ కార్యకర్తలు నా కారుపై దాడి చేశారు: దిలీప్ఘోష్
పార్టీ సమావేశం ముగించుకొని కారులో వస్తున్న తనపై టీఎంసీ కార్యకర్తలు బాంబులు, ఇటుకలతో దాడులకు పాల్పడ్డారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ బుధవారం ఆరోపించారు. ఉత్తర బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లాలో జరిగిన ఈ దాడిలో తన కారు అద్దాలు పగిలిపోవడంతో పాటు తనకు కూడా గాయాలయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతుండగా కూచ్ బెహార్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దాడులపట్ల పోలీసులు కూడా సరిగ్గా స్పందించలేదని తెలిపారు. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. దాడులతో తమకు సంబంధం లేదన్నది. కాగా నాలుగో దఫా ఎన్నికల్లో భాగంగా శనివారం కూచ్ బెహార్ జిల్లాలో పోలింగ్ జరుగనున్నది.
శ్రుతిహాసన్పై క్రిమినల్ చర్యలు తీసుకోండి!
చెన్నై: ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ కుమార్తె, నటి శ్రుతిహాసన్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ జాతీయ మహిళా విభాగం నేత వనతి శ్రీనివాసన్.. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మంగళవారం జరిగిన పోలింగ్లో చెన్నైలో తండ్రి కమల్తో పాటు ఓటు హక్కును వినియోగించుకున్న శ్రుతి.. అనంతరం ఆయనతో పాటు పోలింగ్ బూత్లోకి వెళ్లారని వనతి ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
రాధిక, శరత్కుమార్లకు ఏడాది జైలు
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్