న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలకు వ్యాక్సిన్ను మరింత చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 11 నుంచి పని ప్రదేశాల్లో కూడా టీకా పంపిణీ చేపట్టేందుకు అనుమతించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. టీకా తీసుకోవటానికి అర్హత కలిగి ఉన్న (45 ఏండ్లు పైబడినవారు) కనీసం వంద మంది సిద్ధంగా ఉంటే వారు పనిచేసే చోటే టీకా అందించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. కరోనా తీవ్రత నేపథ్యంలో వ్యాక్సిన్పై వయోపరిమితి తొలగించి టీకా ప్రక్రియను మరింత విస్తృతం చేయాలని పలు రాష్ర్టాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
దడ పుట్టిస్తున్న కరోనా
దేశంలో కరోనా మహమ్మారి దడ పుట్టిస్తున్నది. రోజుకో కొత్త రికార్డు నమోదవుతున్నది. 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 1,15,736 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 630 మంది మరణించారు. రికవరీ రేటు 92.11 శాతానికి పడిపోయింది. దేశంలో ఎనిమిది రాష్ర్టాల్లోనే (మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ) 80.70 శాతం కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. ఒక్క మహారాష్ట్రలోనే 55,469 కొత్త కేసులు రికార్డయ్యాయి. దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో ఆ రాష్ట్ర వాటానే 56.17 శాతంగా ఉన్నది. కాగా, అత్యవసరం కాని దుకాణాలను మూసివేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీకి చెందిన వాణిజ్య విభాగం బుధవారం నాగ్పూర్లో ఆందోళన నిర్వహించింది.
పంజాబ్లో రాత్రికర్ఫ్యూ
కరోనా తీవ్రమవుతున్న నేపథ్యంలో పంజాబ్ వ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్సింగ్ ప్రకటించారు. అలాగే రాజకీయ సమావేశాలపై నిషేధం విధించారు. వివాహాది శుభకార్యాలకు 50 మందిని మాత్రమే అనుమతించనున్నట్టు చెప్పారు. పంజాబ్లో నమోదవుతున్న కేసుల్లో 85 శాతం బ్రిటన్ రకానికి చెందినవేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీలో కర్ఫ్యూ విధించగా, తాజాగా పంజాబ్లోనూ రాత్రి కర్ఫ్యూను విధించారు.
బెంగళూరులో 144 సెక్షన్
కరోనా విజృంభణతో కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. బెంగళూరులో బుధవారం నుంచి 144 సెక్షన్ విధించింది. అలాగే అపార్ట్మెంట్లు, నివాస సముదాయాల్లోని ఈతకొలనులు, జిమ్లు, పార్టీ హాళ్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించింది. మరోవైపు, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఈ నెల 9 నుంచి 19 వరకు సంపూర్ణ లాక్డౌన్ విధించారు.
వ్యాక్సినేషన్లో అమెరికాను అధిగమించాం
వ్యాక్సినేషన్లో అగ్రరాజ్యం అమెరికాను భారత్ అధిగమించింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా టీకా పంపి ణీ చేపడుతున్న దేశంగా భారత్ నిలిచింది. దేశంలో రోజుకు సగటున 30,93,861 మందికి టీకా వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 8.70 కోట్ల డోసుల టీకాలను వేసినట్టు తెలిపింది.
ఈ లక్షణాలున్నా టెస్టు చేసుకోండి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: కరోనా సోకితే కనిపించే లక్షణాలు అంటే చలి జ్వరం, ఒళ్లు నొప్పులు, వాసన, రుచి గ్రహించలేకపోవడం, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు అని మాత్రమే తెలుసు. అయితే ఇవే కాకుండా మరో మూడు లక్షణాలు ఉన్నా జాగ్రత్త పడాల్సిందేనని వైద్యనిపుణులు చెప్తున్నారు. కండ్లు ఎర్రబడటం, వినికిడి సమస్య, ఆహారం జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలు ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.
కారులో ఒంటరిగా ఉన్నా మాస్కు పెట్టాల్సిందే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నా మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందేనని బుధవారం స్పష్టంచేసింది. వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు మాస్కే సురక్షా కవచమని పేర్కొన్నది. మాస్కు ధరించకుండా ఒక్కరే కారులో వెళ్తున్నా జరిమానా విధించాలని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ నిరాకరించారు.
ఇవి కూడా చదవండి..
కఠినమైన పనులతోనే రోజును ప్రారంభిస్తా!
రాధిక, శరత్కుమార్లకు ఏడాది జైలు
లిథియం బ్యాటరీల పనితీరును పెంచే టెక్నిక్