Omar Abdullah : పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఉన్న సిందు నదీ జలాల ఒప్పందాన్ని ఇండియా రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సమర్ధించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో పాకిస్తాన్ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. పాకిస్తాన్ వల్ల మన రక్తమే ఎండిపోయిందన్నారు.
‘‘కాశ్మీర్ ప్రజల సంక్షేమం గురించి ఎప్పుడూ ముందుగా ఆలోచిస్తామని పాకిస్తాన్ తరచూ అంటూ ఉంటుంది. మరి నీళ్ల విషయంలో ఆ వైఖరి ఏమైంది..? మా నీళ్లను మేం వాడుకుంటున్నాం. ఇది తప్పా..? ఔను.. ఇది మా రక్తం (సింధు నదీ జలాలను గురించి). మా రక్తం ఇంకిపోయేలా చేసింది పాకిస్తాన్. ఈ నీళ్లు మావి. నదులు మావి. మా నదుల్ని, నీళ్లను వాడుకునే హక్కు మాకు ఉంది. కాశ్మీర్ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నామని పాక్ చెబుతుంటుంది. మరి నీళ్ల అంశానికి వచ్చేసరికి వారి వైఖరి ఎందుకు మారింది..? మా నదుల నీళ్లను మేం వాడుకుంటుంటే తప్పేంటి? మా నీళ్లను పాక్ వాడుకునేటప్పుడు కాశ్మీర్ ప్రజలపై వారి ఆందోళన ఏమైంది..? ఇక్కడ మాకు ఆరు నదులున్నాయి. వాటిలో మూడు పంజాబ్ నుంచి ప్రవహిస్తాయి. వాటిని పూర్తిగా ఇండియానే వాడుకుంటుంది. మిగతా మూడింటిని పాకిస్తాన్కు ఇచ్చేశాం.
పాకిస్తాన్తో సింధు నదీ జలాల వల్ల మేం చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. చీనాబ్ నుంచి మేం తాగునీళ్లు కూడా తెచ్చుకోలేకపోయాం. తుల్బుల్పై బ్యారేజ్ కూడా కట్టలేకపోయాం. వ్యవసాయం కోసం జీలం నదిని కూడా వాడుకోలేకపోయాం. ఈ నదుల నీటిని నిల్వ చేయడానికి ఒక పెద్ద డ్యాం కూడా కట్టలేకపోయాం. అందుకే అది మా రక్తం. సింధు నదీ జలాల ఒప్పందం అందుకే రద్దైంది. ఈ ఒప్పందం ఇలాగే రద్దు కావాలి. అప్పుడే మనం మన నీటిని సరిగ్గా వాడుకోగలం’’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.