Bihar : బిహార్లో దారుణం జరిగింది. విషవాయువు పీల్చి నలుగురు మరణించారు. మృతుల్లో తండ్రి, కొడుకు కూడా ఉన్నారు. ఈ ఘటన బిహార్, గయా జిల్లాలోని దోభి పోలీస్ స్టేషన్ పరిధి, గర్హ్ కర్మౌని గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానిక అధికారులు దీనికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు. గ్రామానికి చెందిన రైతుకు సంబంధించిన ఒక బావిలో మోటార్ పాడైంది.
దీని రిపేర్ కోసం నలుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. రిపేర్ చేస్తుండగా బావిలోంచి ఉన్నట్లుండి విషవాయువు విడుదలైంది. దీంతో వారు ఆ విష వాయువు పీల్చారు. క్షణాల్లోనే శ్వాస సరిగ్గా ఆడకపోవడంతో వారు కుప్పకూలి మరణించారు. మృతులను చమారి మాంఝి, అతడి కొడుకు దిల్చంద్ మాంఝీ, వికాస్ చౌదరి, విజయ్ చౌదరిగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది.
సీఎం సామ్రాట్ చౌదరి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అలాగే, ఒక్కో మృతుడి తరఫున బాధిత కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.