Big Twist In Vizag Case | విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపిన రాహుల్ రెడ్డి కేసు వ్యవహారం ప్రస్తుతం ఒక ముగింపునకు వచ్చింది. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బావమరిది అయిన రాహుల్ రెడ్డిపై ప్రేమ, పెళ్లి నెపంతో మోసం చేశారంటూ గతంలో ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట్లో ఈ వివాదంలోకి రాహుల్ సిప్లిగంజ్ పేరు రావడం, ఆయన బెదిరింపులకు పాల్పడ్డారనే ప్రచారం జరగడంతో ఈ అంశం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. అయితే ఇటీవల ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధితురాలు మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ఉన్న అసలు నిజాలను బయటపెట్టింది.
తనకు, రాహుల్ రెడ్డికి మధ్య నడిచింది కేవలం వ్యక్తిగత విషయమని, ఇందులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు ఎలాంటి సంబంధం గానీ, ప్రమేయం గానీ లేదని ఆమె స్పష్టం చేసింది. రాహుల్ రెడ్డికి బంధువు కావడం వల్లే రాహుల్ సిప్లిగంజ్ పేరును కొంతమంది బలవంతంగా ఈ వివాదంలోకి లాగారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు తనను తీవ్రంగా మానసిక వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి కొన్ని వీడియోలు చేయించారని, ఆ తర్వాత ఆ వీడియోలు, ఆడియోలను తమకు అనుకూలంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆమె వివరించింది.
అంతేకాకుండా, తనను హనీట్రాప్ కేసులో ఇరికించి జీవితాన్ని నాశనం చేస్తామని, ప్రభుత్వం మరియు పోలీసుల పేర్లను వాడుకుంటూ కొందరు ముఠాగా ఏర్పడి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. జరగని విషయాలను జరిగినట్లుగా చిత్రీకరించి సమాజంలో తన క్యారెక్టర్ను తక్కువ చేసి చూపేందుకు కుట్ర పన్నారని వాపోయింది. అయితే, రాహుల్ రెడ్డికి తనకు మధ్య ఉన్న విభేదాలను ఇద్దరం కూర్చుని మాట్లాడి, పరస్పర అంగీకారంతో సమసిపోయేలా చేసుకున్నామని తెలిపింది. ఇప్పటికే కోర్టులో దాఖలు చేసిన కేసును కూడా పూర్తిగా వెనక్కి తీసుకున్నామని, చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తయ్యాయని ఆమె స్పష్టం చేసింది. ఈ స్పష్టతతో రాహుల్ సిప్లిగంజ్పై వస్తున్న ఆరోపణలన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయింది.