రుద్రంపూర్, ఏప్రిల్ 21 : చుంచుపల్లి మండలంలోని ధన్బాద్ పంచాయతీ పరిధిలో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయంలో జరిగిన చోరీ, విగ్రహ ధ్వంసం ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. కొత్తగూడెం టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ దేవాలయంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుడి తలుపుల తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం హుండీని పగలగొట్టి నగదు దోచుకెళ్లడమే కాకుండా, అమ్మవారి విగ్రహం ఎడమచేయిని ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న టూ టౌన్ సీఐ డి.ప్రతాప్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలను సేకరించారు. నిందితులను త్వరలో పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే జాతీయ రహదారి పక్కనే ఉన్న దేవాలయంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన పోలీసు పెట్రోలింగ్ లేకపోవడమే ఇటువంటి దొంగతనాలకు కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.