సెయింట్ లూయిస్ (యూఎస్ఏ): భారత గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. గ్రాండ్ చెస్ టూర్ లో భాగంగా జరిగిన ఈ టోర్నీలో తొలిసారి టైటిల్ సొంతం చేసుకున్నాడు. మొత్తం 23.5 పాయింట్లతో ప్రజ్ఞానంద అగ్రస్థానం అందుకోగా.. ఉజ్బెకిస్థాన్కు చెందిన జవోఖిర్ సిందరోవ్ 22 పాయింట్లతో రన్నరప్గా నిలిచాడు. అమెరికా స్టార్ వెస్లీ సో 20.5 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు. ర్యాపిడ్ విభాగాన్ని ఒక పాయింట్ ఆధిక్యంతో ముగించిన ప్రజ్ఞానంద, బ్లిట్జ్ లో ఒక్క గేమ్లో మాత్రమే ఓడిపోయి 18 పాయింట్లకు గాను 11.5 పాయింట్లు సాధించి తన ఆధిపత్యాన్ని చాటాడు. ఈ విజయంతో గ్రాండ్ చెస్ టూర్ ఓవరాల్ ర్యాంకింగ్స్లో ప్రజ్ఞా రెండో స్థానానికి చేరి ఈ ఏడాది చివర్లో జరిగే ఫైనల్ బెర్తును దాదాపు ఖాయం చేసుకున్నాడు.