లక్నో: కరోనా చికిత్సను ఫుల్గా క్యాష్ చేసుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. ఇప్పటివరకు కరోనా చికిత్సకు అవసరమైన మందులను బ్లాక్ మార్కెట్ చేయడం, నకిలీ మందులను అమ్మడం వంటివే చూశాం. తాజాగా మరో కొత్తరకమైన స్కాం బయటపడింది. కరోనా మృతుల పేరుతో రెమ్డెసివిర్ ఇంజక్షన్లను ఇచ్చిన విషయం బయటపడింది. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. కాన్పూర్లోని లాలా రజపతిరాయ్ దవాఖాన నర్సింగ్ సిబ్బంది ఈ కుంబకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. హాస్పిటల్ సిబ్బంది ఇంజక్షన్లను స్టోర్లోనుంచి తీసినట్లు దవాఖాన వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఈ ఆరోపణలపై ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించినట్లు జీఎస్వీఎం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ఎం కమల్ తెలిపారు. వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలని, దవాఖానలో రెమ్డెసివిర్ ఇంజక్షన్లకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలని చెప్పినట్లు వెల్లడించారు. తప్పుచేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలిపారు.
మే 22న ఓ మహిళ కరోనా మరణించిందని, ఆమెతోపాటు మరో ముగ్గురు కరోనా మృతుల పేర్లతో రెమ్డెసివిర్ ఇంజక్షన్లు రాశారని దవాఖాన వర్గాలు వెల్లడించారు. మహిళా రోగి గతనెల 22న చనిపోయిందని, అయితే ఆమె పేరుతో అదేనెల 26న రెమ్డెసివిర్ ఇంజక్షన్లను ఇచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనే ఏప్రిల్ 30న కూడా వెలుగులోకి వచ్చింది.