న్యూఢిల్లీ : యమునా నదిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా లేని సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ను సర్కారు నిషేధించింది. యమునా నదిలో కాలుష్యాన్ని నివారించడానికి నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్ల విక్రయాలను నిషేధించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యమునా మానిటరింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బ్యాన్ విధించింది. సంబంధిత విభాగాలపై నియంత్రణ ఉన్న స్థానిక సంస్థలు, పౌర సరఫరా విభాగాలు, జిల్లా పరిపాలన సహా సంబంధిత అధికారులందరూ నిషేధాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, ఈ మేరకు తనిఖీలు చేపట్టాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నెలవారీగా సంబంధిత నివేదికలను సమర్పించాలని కాలుష్య నియంత్రణ సంస్థ అధికారులను కోరింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జనవరిలో ఇద్దరు సభ్యుల నిపుణుల కమిటీ సిఫారసులను అంగీకరించింది. బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా లేని డిటర్జెంట్ల అమ్మకం, నిల్వ, రవాణా, మార్కెటింగ్ను నిషేధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాణ్యత లేని సబ్బులు, డిటర్జెంట్ల వినియోగించడంతో కలిగే హానికరమైన ప్రభావం గురించి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించాలని ఎన్జీటీ ఢిల్లీ ప్రభుత్వాన్ని సూచించింది.
యమునా నది కాలుష్యానికి ప్రధాన కారణాల్లో సబ్బులు, డిటర్జెంట్లు సైతం కారణమని నిపుణులు పేర్కొన్నారు. చాలా సార్లు ఢిల్లీలో యమునా నదిలో తేలియాడే విషపూరితమైన నురుగు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. అధిక ఫాస్పేట్ కంటెంట్ ఉన్న రంగు పరిశ్రమలు, ధోబీ ఘాట్లు, గృహాల్లో ఉపయోగించే సబ్బులు, డిటర్జెంట్లతో యమునా నది నీటిలో విషపూరిత నురుగు ఏర్పడిందని ప్రధాన కారణమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారి తెలిపారు.