న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఊరట కలిగించే వార్త. అమెరికా వెళ్లేందుకు భారతీయ విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువపత్రం అవసరం లేదని అమెరికా దౌత్యాధికారి డాన్ హెఫ్లిన్ వెల్లడించారు. అయితే ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్ పరీక్ష చేయించుకుని నెగెటివ్ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. అమెరికా వెళ్లడానికి వ్యాక్సిన్ ధ్రువపత్రం అవసరం లేకపోయినప్పటికీ.. ఆయా యూనివర్సిటీలు, స్కూళ్లు సొంత వ్యాక్సిన్ నిబంధనలు పాటిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు ముందుగా తమ విద్యాసంస్థలను సంప్రదించి నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులకు తోడుగా వెళ్లే తల్లిదండ్రులను పర్యాటకులుగా వర్గీకరిస్తారని, అయితే కరోనా నేపథ్యంలో పర్యాటకులపై నిషేధం విధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. జూలై, ఆగస్టులలో వీలైనంత త్వరగా సాధ్యమైనన్ని విద్యార్థి వీసా దరఖాస్తులను పరిష్కరించేలా పనిచేస్తున్నట్టు చెప్పారు.
వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కేటాయింపు షురూ
అమెరికా స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో సోమవారం ఈ ప్రక్రియ మొదలైంది. తొలిరోజే స్లాట్ల కోసం విద్యార్థులు తీవ్రంగా పోటీపడ్డారు. అయితే అపాయింట్మెంట్ కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు తరుచూ రిఫ్రెష్ బటన్ను నొక్కరాదని, ఇలా చేసేవారి అకౌంట్ను లాక్చేస్తామని యూఎస్ ఎంబసీ వర్గాలు హెచ్చరించాయి. కావల్సినన్ని అపాయింట్మెంట్స్ను అందుబాటులో ఉంచుతామని, పరిస్థితులు అనుకూలిస్తే వీటి సంఖ్యను పెంచుతామని యూఎస్ ఎంబసీ ట్విట్టర్లో ప్రకటించింది.