– బీఆర్ఎస్వీ ఎంజీయూ అధ్యక్షుడు వాడపల్లి నవీన్
రామగిరి, ఆగస్టు 10 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ (MGU) బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్ను నార్కెట్పల్లి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసే విద్యార్థి నాయకులను అక్రమంగా ముందస్తు అరెస్టులు చేయడం దారుణమన్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన ప్రతి హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతులను ముందస్తు అరెస్టులతో అణచివేయాలని చూడటం సరికాదని, విద్యార్థుల హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.