Missile attack : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ జల సంధిలో చమురు ట్యాంకర్ (Oil tanker) పై ఇరాన్ (Iran) క్షిపణి దాడి (Missile Attack) చేసింది. దాంతో నౌకలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడుల్లో పక్కనే ఉన్న మరో చమురు నౌక కూడా స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అయితే దాడికి గురైనవి ఏ దేశానికి చెందిన ట్యాంకర్లు, సిబ్బంది ప్రాణాలతో ఉన్నారా లేదా..? అనే వివరాలు తెలియాల్సి ఉంది. కాగా హర్మూజ్ జలసంధిలోని జల మార్గాలపై ఒమన్తో అమెరికా చర్చలు జరుపుతున్న వేళ ఈ దాడులు జరగడం గమనార్హం. మరోవైపు దక్షిణ ఇరాన్ గగనతలంలో చక్కర్లు కొడుతున్న అగ్రరాజ్య ఎంక్యూ-9 డ్రోన్ను ఐఆర్జీసీ దళాలు కూల్చివేశాయని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇదిలావుంటే సౌదీ అరేబియా-హూతీల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. సౌదీ సైనికులే లక్ష్యంగా ఓడరేవుపై జరిపిన దాడుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇక అరామ్కోకు చెందిన జాజన్ రిఫైనరీపైనా హూతీలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటన కారణంగా చమురుశుద్ధి కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగాయి. దాంతో ఆ చమురు రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు.
ఈ ఘటనలో ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియా ‘మక్కా ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఏ ఒక్కదానిపై దాడి జరిగినా దాన్ని మిగిలిన రెండు దేశాలపైనా దాడిగా పరిగణించి కలిసికట్టుగా ఎదురు తిరుగుతారు. ఈ డీల్ కుదుర్చుకున్న కొన్ని రోజుల్లోనే హూతీలు సౌదీపై దాడులు చేయడం గమనార్హం. దాంతో ఇప్పుడు పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది.