న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17 : ఇకపై మందుల దుకాణాల్లో సీసీటీవీ నిఘాను తప్పనిసరి చేసేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదిస్తున్నది. నిర్దేశిత హెచ్, హెచ్1, ఎక్స్ క్యాటగిరీ ఔషధాల అమ్మకాలపై నిఘా కోసం ఈ చర్య చేపట్టనుంది. విస్తృతశ్రేణి ప్రిస్క్రిప్షన్ మందులు (వైద్యుల సూచనలతో వాడే మందులు)ను హెచ్ శ్రేణిగా, అదనపు పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ అవసరమయ్యే కొన్ని నిర్దిష్ట మందులను హెచ్1లోకి, అత్యంత కఠినమైన నియంత్రణలు కలిగిన మందులను ఎక్స్ శ్రేణిగా పరిగణిస్తారు.
ఈ మూడు శ్రేణులకు చెందిన ఔషధాల అమ్మకాలు, పంపిణీని నియంత్రించడానికి, సరైన వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకాలు నిరోధించడానికి, రిటైల్ దుకాణ అమ్మకాల్లో పారదర్శకత, బాధ్యత పెంచడానికి, ఔషధ సరఫరా చైన్ను నియంత్రించడానికి ఈ చర్యలను ప్రతిపాదిస్తున్నారు. దీనిపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.