Deviprasad : ప్రభుత్వంపై నమ్మకంతో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేసిన ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని రేవంత్ రెడ్డి సర్కార్ను బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవీప్రసాద్ (Deviprasad) హెచ్చరించారు. ఉద్యోగుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించిన ఆయన పీఆర్సీ, డీఏలై ఇకనైనా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేసిన ఉద్యోగుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవీప్రసాద్ ధ్వజమెత్తారు. సెప్టెంబర్ 14 లేదా 15 తేదీల్లో పీఆర్సీ నివేదికను తెప్పిస్తామని
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ నుంచి నివేదిక ఎందుకు రాలేదు? అని ప్రశ్నిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నివేదిక విషయంలో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల్లో అనేక అనుమానాలకు తావిస్తోందని దేవిప్రసాద్ తెలిపారు.
లక్షలాది మంది ఉద్యోగులు సెప్టెంబర్ 18న ప్రభుత్వం నిర్వహించనున్న చర్చల ద్వారా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో చర్చలను వాయిదా వేయడం తీవ్ర నిరాశ కలిగించిందని ఆయన పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న పీఆర్సీ, పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందని బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వానికి గతంలో సమయం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాలు ఉద్యమాలను వాయిదా వేస్తే ప్రభుత్వం కూడా చర్చలను వాయిదా వేయడం సమస్య పరిష్కారానికి మార్గం కాదని దేవిప్రసాద్ ఉద్బోదించారు. కాంగ్రెస్
ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి ఉద్యోగులను బాధ్యులుగా చూపించకుండా, సమస్యలకు కారణమైన అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఉద్యోగ సంఘాల నాయకత్వం కూడా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని ఆయన కోరారు. ఇక మాటలు, హామీలు కాకుండా నిర్ణయాలు కావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే జేఏసీతో చర్చలు ప్రారంభించి పీఆర్సీ, డీఏలు, ఇతర పెండింగ్ సమస్యలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని దేవిప్రసాద్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో ఉద్యోగులు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రేవంత్ ప్రభుత్వాన్ని దేవీప్రసాద్ హెచ్చరించారు.