ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 17: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) మరోసారి తన మానవతా దృక్ఫథాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం హైద్రాబాద్లోని నిమ్స్(NIMS)లో చేరిన ఇద్దరు మహిళలు ఎల్వోసీ (LOC) కోసం అర్జీ పెట్టుకోగా తక్షణం స్పందించారు కేటీఆర్. వెంటనే వారి చికిత్సలకు రిఫరల్ లెటర్లు కేటీఆర్ అందించారని గురువారం బీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల అసమర్ధ పాలనను ఓవైపు ఎండగడుతూనే.. మరోవైపు ఎమ్మెల్యేగా తన ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తున్నారు కేటీఆర్. వైద్యం కోసం నిమ్స్లో చేరిన ఇద్దరు మహిళల చికిత్స కోసం ఆయన రిఫరల్ లెటర్లు అందించారు. వివరాల్లోకి వెళితే.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లికి చెందిన పాతూరి సుగుణ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్య చికిత్స కోసం ఆమె హైద్రాబాద్లోని నిమ్స్లో చేరింది. గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన గుగులోత్ లక్ష్మి కూడా నిమ్స్లోనే అడ్మిట్ అయింది.
తమ వైద్య చికిత్సల కోసం తమ ప్రాంత ఎమ్మెల్యే కేటీఆర్కు లక్ష్మి, సుగణలు తమ ఆర్థిక సమస్యపై సమాచారమిచ్చారు. వారి అభ్యర్థనపై వెంటనే స్పందించిన కేటీఆర్ వీరి చికిత్సకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి రిఫరల్ లెటర్ పంపారు. కేటీఆర్ చొరవతో సుగుణకు రూ.3.50లక్షలు మంజూరు కాగా.. గుగులోత్ లక్ష్మికి రూ.1.50 లక్షలు మంజూరయ్యాయి. దాంతో.. లక్ష్మికి మంజూరైన చెక్కును బీఆర్ఎస్ యూత్వింగ్ నాయకుడు భూక్యా గణేశ్ హాస్పిటల్లో ఆమెకు అందించారు. ఎల్వోసీ మంజూరు చేసినందుకు ఇరు కుటుంబాల సభ్యులు, బండలింగంపల్లి సర్పంచ్ బాల్రాజ్ నర్సాగౌడ్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.