శామీర్పేట: నిరుద్యోగ యువతీ, యువకులు ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీవో పద్మజారాణి అన్నారు. మూడుచింతల్పల్లి మండల సమావేశ మందిరంలో శుక్రవారం వృత్తి నైపుణ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి ఆవకాశాలు కల్పించే దిశగా డీఆర్డీవో ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
వృత్తి నైపుణ్యంలో అవగాహన కల్పించి ఎలక్ట్రికల్, హోటల్, బ్యాంక్, మార్కేటింగ్, సేల్స్, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, అకౌంటింగ్, సాఫ్ట్-వేర్, డ్రైవింగ్ వంటి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ఇంటర్వ్యూ లు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సదస్సుకు 200ల మంది హాజరయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హారికమురళిగౌడ్, ఎంపీడీవో సువిద, సర్పంచ్ జామ్ రవి, ఎంపీవో రవి, ఏపీఎం మున్నుస్వామి పాల్గొన్నారు.