న్యూఢిల్లీ: ఒక వ్యక్తి వెనుక భాగంలో గోనె సంచి పరిమాణంలో ఉన్న కణితి వేలాడుతోంది. (Gunny Bag Size Tumour Removed ) 2008 నుంచి దీనితో ఇబ్బంది పడిన విదేశీయుడికి చివరకు దీని బాధ తప్పింది. దేశ వైద్యులు సుమారు పది గంటలపాటు శ్రమించారు. 16.7 కేజీల బరువున్న భారీ కణితిని సర్జరీ ద్వారా తొలగించారు. హర్యానాలోని గురుగ్రామ్లో ఉన్న ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఎంఆర్ఐ) వైద్యులు ఈ ఘనత సాధించారు. పసిఫిక్ దీవులకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి వీపు భాగంలో భారీ సైజులో కణితి ఏర్పడింది. 2008 నుంచి క్రమంగా పెరుగుతున్న ఈ కణితి 58 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వెడల్పుతోపాటు 16.7 కిలోల బరువుకు చేరింది.
కాగా, వెనుక వైపు వేలాడిన భారీ కణితితో ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. క్యాన్సర్ కణితి కాని దీనిని తొలగించడం వల్ల అతడి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పలు ఆసుపత్రుల డాక్టర్లు భావించారు. దీంతో భారీ కణితిని తొలగించేందుకు వారు సాహసం చేయలేదు. ఈ నేపథ్యంలో విదేశీయుడైన ఆ వ్యక్తి చివరకు గురుగ్రామ్లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఎంఆర్ఐ)ను ఆశ్రయించాడు. పది గంటలకుపైగా శ్రమించిన అక్కడి వైద్యులు అధునాతన శస్త్రచికిత్స ద్వారా ఆ భారీ కణితను తొలగించారు.
మరోవైపు జెయింట్ న్యూరోఫైబ్రోమా అనేది ఒక రకమైన నరాల పరిధికి చెందిన కణితి అని ఎఫ్ఎంఆర్ఐకు చెందిన సర్జికల్ ఆంకాలజీ సీనియర్ డైరెక్టర్, డాక్టర్ నిరంజన్ నాయక్ తెలిపారు. చర్మంపైన లేదా కింద భాగంలో ఇలాంటి గడ్డలు ఏర్పాడతాయని చెప్పారు. జన్యుపరమైన కారణాల వల్ల ఏర్పడే ఈ కణితులు కాలానుగుణంగా చాలా పెద్ద పరిమాణానికి పెరుగుతాయని అన్నారు.
కాగా, శరీరంలోని రక్త నాళాలతో కూడిన ఇలాంటి భారీ కణితిని తొలగించడం వల్ల తీవ్ర రక్త స్రావంతో వ్యక్తి ప్రాణాలకు ముప్పు కలుగుతుందని డాక్టర్ నిరంజన్ నాయక్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ముప్పును నివారించేందుకు తమ వైద్య బృందం రెండు విధానాల ద్వారా ముఖ్యమైన 11 రక్త నాళాలను నిరోధించిందని చెప్పారు. తద్వారా సర్జరీ ద్వారా ఈ భారీ కణితిని తొలిగించినట్లు వివరించారు.
మరోవైపు సర్జరీ తర్వాత వీపు భాగాన్ని కవర్ చేసేందుకు క్యాన్సర్ కాని ఈ కణితి చర్మాన్ని స్కిన్ గ్రాఫ్ట్గా ఉపయోగించినట్లు డాక్టర్ నిరంజన్ నాయక్ తెలిపారు. నాలుగు రోజుల్లో కోలుకున్న ఆ వ్యక్తిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. ఇంత కాలం వీపు భాగంలో వేలాడే భారీ కణితితో చాలా కష్టంగా జీవించిన ఆ వ్యక్తికి ఆ బాధలు తొలగిపోయాయని, ఇకపై సంతోషంగా అతడు జీవించవచ్చని అన్నారు.