హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతున్నదని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో హరీశ్రావు మాట్లాడారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయని, ఈ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రాబోతున్నాయని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ బస్సుయాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తున్నదని, మహిళలు, రైతులు, యువత కేసీఆర్కు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారని చెప్పారు.
రైతులు, మహిళలు, పెన్షన్దారులు కేసీఆర్ను గుర్తుచేసుకుంటున్నారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్కే ఎకువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ గ్యారెంటీలు బౌన్స్ అయ్యాయని, అందుకు ఆ పార్టీకి ప్రజలు శిక్ష వేయాలని చెప్పారు. చెక్ బౌన్స్ తరహాలో కాంగ్రెస్ రాసిచ్చిన ఆరు గ్యారెంటీల బాండ్ పేపర్ బౌన్స్ అయ్యిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాండ్ పేపర్ ప్రామిస్లు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు దేవుళ్ల మీద ప్రామిస్లు అన్నట్టు కాంగ్రెస్ వ్యవహారం ఉన్నదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పరిపాలనలేదని, పగ, ప్రతీకారాలే కనిపిస్తున్నాయని తెలిపారు. సీఎం ప్రతిపక్షాల గొంతునొక్కడమే పనిగా పెట్టుకొన్నారని, సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రం దివాలా తీసిందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను హరీశ్రావు తప్పుబట్టారు. ముఖ్యమంత్రే ఇలా చెబితే పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. రేవంత్ మాటల వల్ల రియల్ ఎస్టేట్ కుదేలైందని, పెట్టుబడులు రావటంలేదని చెప్పారు. రాష్ట్రంలో మోటర్లు కాలిపోవటం, పంటలు ఎండిపోవటం, విద్యుత్తు కోతలు, నీటి కొరత, పోలీసు కేసులు, నిర్భందాలు వంటి మార్పు మొదలైందని వ్యంగ్యాస్తాలు సంధించారు. ప్రభుత్వాసుపత్రుల్లో జరగాల్సిన డెలివరీలు ప్రైవేట్ దవాఖానల్లో జరగటం వంటి మార్పును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఐదు నెలల్లోనే వద్దురో నాయన కాంగ్రెస్ పాలన అని ఛీదరించుకుంటున్నారని వెల్లడించారు.
ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేశామని కాంగ్రెన్ నేతలు చెప్పడం సత్యదూరమని హరీశ్రావు స్పష్టంచేశారు. ‘మహాలక్ష్మీ పథకంలో ప్రతి మహిళకు రూ.2,500, రైతుభరోసా రూ.15 వేలు, ధాన్యానికి రూ.500 బోనస్, వందరోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు రూ.5 లక్షలు, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, నిరుద్యోగ భృతి, చేయూత కింద రూ.4 వేల పెన్షన్ తదితర గ్యారెంటీల అమలులో సర్కారు ఫెయిల్ అయ్యిందని మండిపడ్డారు. 91 లక్షల తెల్లరేషన్ కార్డుదారులుంటే గృహజ్యోతి పథకాన్ని 30 లక్షల మందికే ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పెండింగ్లో ఉన్న మూడు డీఏలతో పాటు నాలుగో డీఏను పెండింగ్లో పెట్టి ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ప్రజాపాలనలో స్వీకరించిన 3.5 లక్షల దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేర్చారు. కానీ, బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలున్న వేదికపైనే ఈ మ్యానిఫెస్టో ప్రకటించారు. ఇదేం నీతి? అని హరీశ్రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, మెదక్, సికింద్రాబాద్, వరంగల్లో కాంగ్రెస్ది మూడోస్థానమేనని తెలిపారు. ‘వడ్లు కొనటం చేతగాని బీజేపీ తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతుంది? నూకలు బుక్కుమన్న ఆ పార్టీకి రైతులు ఎందుకు ఓటు వేయాలి? బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది? కేసీఆర్ కంటే ధార్మికుడు, భక్తుడు బీజేపీలో ఎవరూ లేరు.
గతంలో దేవాలయాల నిధులు ఇతర అవసరాలకు వాడేవారు. కానీ, దేవాలయాలకు ప్రభుత్వ నిధులు ఇచ్చింది కేసీఆర్ మాత్రమే. బీజేపీ, కాంగ్రెస్ ఇచ్చే అబద్ధపు హామీలతో ప్రజల గుండెలు మండుతున్నాయి’ అని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకయ్యాయని విమర్శించారు. తలా 8 సీట్ల చొప్పున గెలుచుకునే ఒప్పందం ఇరుపార్టీల మధ్య కుదిరిందని ఆరోపించారు. టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్డీటీవీ ఎగ్జిగ్యూటివ్ ఎడిటర్ ఉమాసుధీర్ సంధానకర్తగా వ్యవహరించగా, టీయూడబ్ల్యూజే నాయకులు సత్యనారాయణ, శంకర్గౌడ్, షౌకత్ పాల్గొన్నారు.
దుబ్బాక, మే 4: అడ్డిమార్ గుడ్డి దెబ్బలా రేవంత్రెడ్డి సీఎం అయ్యారని మాజీమంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో, అక్బర్పేట-భూంపల్లి, నారాయణరావుపేటలో నిర్వహించిన రోడ్షోల్లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి పొద్దున లేస్తే కేసీఆర్పై తిట్లు.. లేకపోతే దేవుళ్లపై ఒట్లు తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలన రివర్స్లో నడుస్తున్నదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణను సంక్షేమం, అభివృద్ధిలో నెంబర్వన్గా నిలిపితే, రేవంత్రెడ్డి తన సీటు కాపాడుకోవటానికే ఆరాటం పడుతున్నాడని ధ్వజమెత్తారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ దేవుళ్ల ఫొటోలతో ఓటు బ్యాంకు రాజకీయం చేస్తే, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు దేవుళ్లపై ఒట్లు వేసి ప్రజలను మోసగిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ పేదలపై పన్నుల భారం (జీఎస్టీ) మోపి అదానీ, అంబానీలను పోషిస్తున్నదని ఆరోపించారు. చివరికి బీడీ కార్మికులను సైతం వదలలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కట్టలపై పుర్రెగుర్తు తీసుకొచ్చి కార్మికుల పొట్టకొడితే, బీజేపీ అధికారంలోకి వచ్చాక జీఎస్టీ విధించి కార్మికులను రోడ్డుపై పడేసిందని వెల్లడించారు. విద్యావంతుడు, కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామిరెడ్డిని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వినతాభూంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మనోహర్రావు, రాజమౌళి, ఎర్రోళ్ల శ్రీనివాస్, రవీందర్రెడ్డి, కిషన్రెడ్డి, వంశీ కార్తిక తదితరులు పాల్గొన్నారు.