ఐనవోలు/రామడుగు (చొప్పదండి), మే 4: నీళ్లు లేక ఎండిన పంటలు.. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని శివారు లక్ష్మీపురానికి చెందిన రైతు తక్కళ్లపల్లి మురళీధర్రావు (46)కు ఎకరం 20 గుంటల భూమి, బావి ఉన్నాయి. వ్యవసాయంతోపాటు గ్రానైట్ కంపెనీలో పని చేసేవాడు. పెట్టుబడుల కోసం అప్పు చేసి కొంత భూమిలో పత్తి, మరికొంత వరి వేశాడు.
బావిలో నీళ్లు అడుగంటి, పంటలకు సాగునీరందకపోవడంతో మొత్తం ఎండిపోయి పెట్టుబడి మట్టిపాలైంది. వ్యవసాయం, ఇద్దరు పిల్లల చదువుల కోసం చేసిన రూ.6 లక్షల అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్సకోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి గురువారం చనిపోయాడు. అతనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కూడా అందలేదని కుటుంబసభ్యులు తెలిపారు. అతడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉండగా, భార్య సరిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా దేశరాజుపల్లికి చెందిన కంకణాల రమేశ్ అలియాస్ రవి (40) గ్రామంలోని ఓ రైతు వద్ద రెండెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాడు. పెట్టుబడి కోసం బంధువుల వద్ద అప్పు చేశాడు. నీరందక పంట సరిగా పండలేదు. దీంతో అప్పులు పెరిగిపోవడం, వాటిని తీర్చే దారి తెలియక శుక్రవారం గ్రామ శివారులోని మహంకాళి బావిగడ్డపై పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్ దవాఖానకు, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. శనివారం పరిస్థితి విషమించి మరణించాడు. భార్య సమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.