Summer | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నిప్పుల వర్షం కురుస్తూనే ఉంది. భానుడి భగభగలతో ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. మరో మూడు, నాలుగు రోజులపాటు వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటాయని, పగటి పూట ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా.
శనివారం 58 మండలాల్లో తీవ్ర వడగాలులు,169 మండలాల్లో వడగాలులు వీచినట్టు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్టులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో ఏడుగురు మృతిచెందారు.