నాంపల్లి కోర్టులు, మే 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేసవి తీవ్రత అధికమవడంతో విధులకు హాజరు కాలేకపోతున్న లాయర్లకు హైకోర్టు ఉపశమనం కల్పించింది. తీవ్రమైన ఎండలు, వడగాడ్పుల వల్ల న్యాయవాదులు గైర్హాజరైనట్టయితే వారి కేసులకు సంబంధించి వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయరాదని ఆదేశించింది.
ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ తిరుమలాదేవి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి అమల్లోకి వచ్చే ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని కోర్టుల జ్యుడిషియల్ అధికారులు (మేజిస్ట్రేట్లు) పాటించాలని స్పష్టం చేశారు. హైకోర్టు బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వెలువడిన ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లకు పంపినట్టు తిరుమలాదేవి తెలిపారు.