Corona in Lungs :రెండోదశ ( Second wave ) కరోనా ఊపిరితిత్తులపై అధిక ప్రభావం చూపుతున్నదని, ఇదివరకే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు ఇప్పుడు మరింత జాగ్రత్తపడాలని హైదరాబాద్ ప్రభుత్వ చెస్ట్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ఖాన్ సూచించారు. శ్వాస సంబంధ సమస్యలు ( respiratory problems ) ఉన్నవారు ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యొద్దని చెప్పారు. సాధారణ లక్షణాలున్నవారికి పాజిటివ్ వచ్చినా హోంఐసొలేషన్లో ఉండి మందులు వాడితే వైరస్ నుంచి బయటపడవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రిటికల్, హెల్త్ ఎమర్జెన్సీ నెలకొన్నదని, కరోనాను జయించేందుకు ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. కరోనా రెండోదశ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో శ్వాస సంబంధ సమస్యలు, ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం, అనుసరించాల్సిన విధానాలు, జాగ్రత్తలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డాక్టర్ మహబూబ్ఖాన్ సమాధానాలు ఇచ్చారు.
కరోనా సెకండ్వేవ్లో ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇంతకుముందు ఊపిరితిత్తుల్లో వైరస్ సోకినా ( Corona in Lungs ) ఇంత ఉద్ధృతంగా లేదు. కరోనా ఇన్ఫెక్షన్ మొదట ఊపిరితిత్తుల్లో చేరి, అక్కడి నుంచి శరీరంలోని వేర్వేరు అవయవాలకు వ్యాపిస్తుంది. తొలుత దీనిని న్యుమోనియా అంటారు. ఈ వైరస్ వల్ల ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుతుంది. ఆ తర్వాత వైరస్ అంతటా వ్యాపించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఆయాసం వంటివి కలుగుతాయి. ఊపిరితిత్తులపై వైరస్ తీవ్ర ప్రభావం చూపితే దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఊపిరితిత్తులు 15 శాతం ఎఫెక్ట్ అయిన వాళ్లలో ఇబ్బంది ఉండదు. తీవ్రత పెరిగే కొద్దీ.. మొదట్లో చికిత్స కష్టంగా ఉంటుంది. అటువంటి వారు కోలుకున్న తర్వాత దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. లేదంటే ఊపిరితిత్తులు దెబ్బతిని పీచులా మారతాయి. చిన్న చిన్న కన్నాలు ఏర్పడతాయి. ఇన్ఫెక్షన్ను ముందుగా గుర్తించి సరైన మందులు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కరోనా వ్యాధి తీవ్రతను మైల్డ్, మోడరేట్, సివియర్గా నిర్ధారిస్తారు. వ్యాధి లక్షణాల్లేకుండా మైల్డ్లో ఉన్నవారికి ఇబ్బంది ఉండదు. మైల్డ్ సింప్టమ్స్.. ఒళ్లు వెచ్చబడటం, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, కొద్దిగా తలనొప్పి. ఈ సింప్టమ్స్ ఉన్నవారు పరీక్షలు చేయించుకొని హోం ఐసొలేషన్లో ప్రభుత్వం ఇచ్చే మందులు వాడితే సరిపోతుంది. హోం ఐసొలేషన్లో మోడరేట్ లక్షణాలు ఉన్న వాళ్లు ఆక్సిమీటర్తో పల్స్రేట్ ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఒకవేళ పల్స్ తక్కువ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వయసు పైబడి, లేదా ఇతర వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో మందులు తీసుకోవాలి. మైల్డ్ వాళ్లంతా.. హాస్పిటల్కు రావాల్సిన పనిలేదు. దాదాపుగా హోం ఐసోలేషన్లో ఉండి మంచి మందులు తీసుకోవచ్చు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారు, శ్వాస తీసుకోవడంలో అవస్థ, ఇతర వ్యాధులతో బాధపడుతూ మోడరేట్, క్రిటికల్ దశలో ఉన్నవారిని తప్పనిసరి దవాఖానలో చేర్చి వైద్యచికిత్స అందించాలి.
క్రిటికల్ అని నిర్ధారించడానికి చాలా ప్రామాణికాలున్నాయి. పల్స్రేట్ పెరగడం, రెస్పిరేటరీ రేట్ పెరగడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం, తర్వాత కాన్సియస్ నెస్ తగ్గిపోవడం.. రక్త పరీక్షల ద్వారా, సీటీ స్కాన్ ద్వారా వచ్చిన ఫలితాలు వంటివి పరిశీలించి క్రిటికల్ దశగా నిర్ణయించి దవాఖానకు తరలిస్తాం. అలాంటి వారిని తప్పనిసరిగా ఐసీయూలో ఉంచాలి. ఇందులో దాదాపు 50-60 శాతం మందికి వెంటిలేటర్స్ అవసరం పడొచ్చు. క్రిటికల్ దశలో ఉన్నవారి పరిస్థితిని బట్టి.. వాళ్లు తొందరగా వచ్చారా? ఆలస్యంగా వచ్చారా? లేదంటే వాళ్లకు ఏమైనా.. ఇతర వ్యాధులు ఉన్నాయా? ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటాం. అందుకు తగిన విధంగా వైద్యసేవలు అందిస్తాం.
మొదట వీళ్లకు వచ్చిన తీవ్రతను బట్టి భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి. క్రిటికల్ దశలో ఉన్న వారికి తప్ప.. ఇతరులకు హైడోస్ మందులు ఇవ్వడం అంటూ ఉండదు. వ్యాధి లక్షణాలు, శరీరతత్వాన్ని బట్టి 10 రోజులు మాత్రమే మందులు ఇస్తాం. అందరికీ హైడోస్ ఇవ్వడం జరుగదు కాబట్టి భవిష్యత్తులో సమస్యలురావు. క్రిటికల్, అంతకుముందే శ్వాస సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి భవిష్యత్తులో ఊపిరితిత్తులు, శ్వాస సమస్యలు రావచ్చు. వాళ్లంతా వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ తగిన మందులు వాడాలి. వ్యాయామం, రెస్పిరేటరీ థెరపీ చేసుకోవాలి. యోగా, ప్రాణాయామం, వాకింగ్ వంటి వాటి వల్ల సమస్య నుంచి బయటపడొచ్చు.
మొదటి దశ, రెండోదశ కరోనా లక్షణాలకు చాలా తేడా ఉంది. మొదటిదశలో పిల్లలు, మహిళలు తక్కువగా ఎఫెక్ట్ ఉండేవారు. ఇప్పుడు పిల్లలు, ఆడవారు, యువకులు అధికంగా ఎఫెక్ట్ అవుతున్నారు. వ్యాధి తీవ్రత పెరిగి క్రిటికల్ దశకు చేరుకున్న వారిలో మరణాల శాతం కూడా పెరిగింది. రోగుల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ అంశాలు వైద్యరంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వైద్యసేవలు అందించడంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వయోవృద్ధులు, కరోనా వ్యాధి తీవ్రత పెరిగి ఆలస్యంగా వచ్చిన వారు తప్ప.. ముందుగా గుర్తించి, ఇతర జబ్బులు ఏవీ లేని మధ్య వయస్కులు, పిల్లలు వేగంగా రికవరీ అవుతున్నారు.
ఇది క్లిష్టమైన హెల్త్ ఎమర్జెన్సీ సమయం. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదు. దీనిని ప్రభుత్వం, వైద్యరంగాలు మాత్రమే ఎదుర్కొనలేవు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలి. ప్రభుత్వ దవాఖానలకు పేద కుటుంబాల వారే వస్తుంటారు. మా దగ్గరికి వచ్చిన రోగులు వీఐపీలైనా.. సాధారణ వ్యక్తులైనా ఒకే విధంగా వైద్యసేవలను అందిస్తాం. తీవ్ర వ్యాధి లక్షణాలతో మా దగ్గరికి వచ్చే రోగులు తొందరగా కోలుకోవాలని వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వార్డు బాయ్లు ఇలా అందరూ కృషిచేస్తారు. వారు కోలుకుని చిరునవ్వుతో ఇండ్లకు వెళ్తుంటే అంతవరకు పడ్డ కష్టాన్ని మేమంతా మరచిపోతాం. రెండోదశ కరోనా తీవ్ర ప్రభావం చూపడం, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉండటం మాకు బాధను కలిగిస్తున్నది. ప్రజలు ఎవరికి వారు బాధ్యతగా ఉంటూ ఈ వైరస్ను ఎదుర్కొనాలి. వ్యాక్సిన్ తప్పనిసరి వేయించుకోవాలి. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంచేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటివి మరచిపోవద్దు.
– డాక్టర్ మహబూబ్ఖాన్
–హైదరాబాద్ సిటీ బ్యూరో, నమస్తే తెలంగాణ
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!