Health Tips | బాల్యంలో పిల్లలకు రోజుకు ఒక గ్లాసు పాలు తాగించాలని పెద్దలు వెంటపడటం సహజం. అయితే మనకు వాటి ప్రయోజనం అంతగా తెలియదు. కానీ, పాలలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీంతో మనకు దీర్ఘకాలికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మనం ఆరోగ్యంగా, జబ్బుపడకుండా ఉండటానికి కాల్షియం లాంటి మినరల్స్ అవసరమవుతాయి. మన దంతాలు, ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన మినరల్స్లో కాల్షియం ఒకటి. ఆహారం ద్వారా శరీరానికి కాల్షియం తగినంత అందకపోతే ఎముకల వ్యాధులు, దంత సమస్యలు దాపురిస్తాయి. కాల్షియం లోపాన్ని హైపోకాల్సీమియా అంటారు. ఇది మెదడు కణాల మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. జ్ఞాపకశక్తి సమస్యలకు దారితీస్తుంది. కుంగుబాటు, కండరాలు పట్టేయడం, ఎముకలు గుల్లబారే ఆస్టియో పోరోసిస్, కీళ్లనొప్పులు, బలహీనమైన పెళుసైన గోళ్లు తదితర సమస్యలకు కారణమవుతుంది.
ఇవి కాల్షియం తగ్గితే వచ్చే సాధారణ సమస్యలు కాగా, హైపోకాల్సిమియా కారణంగా గుండె సమస్యలు కూడా వస్తాయని ఓ పరిశోధన తేల్చింది. సెడార్స్ సినాయ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఈ అధ్యయనం చేసింది. ఇందులో కాల్షియం మోతాదు మరీ తక్కువగా ఉన్నవాళ్లు అంతకుముందు గుండె సమస్యలు లేకపోయినప్పటికీ అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ బారినపడ్డట్టు పరిశోధకులు గుర్తించారు. శరీరంలో కాల్షియం స్థాయులు తక్కువగా ఉన్నప్పుడు గుండె గోడలు బలహీనంగా మారిపోతాయి. ఇది గుండె కొట్టుకోవడం ఆగిపోయే సమస్య కార్డియాక్ అరెస్ట్కు దారితీస్తుంది. ముఖ్యంగా 50 ఏండ్లు దాటినవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పెద్దయ్యాక గుండెజబ్బుల ముప్పు తప్పించుకోవాలంటే కాల్షియం సమృద్ధిగా ఉన్న… పాలు, పాలకూర, పెరుగు లాంటి పదార్థాలు ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.