రుద్రంపూర్, ఆగస్టు 13 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం సెంటర్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సెల్ను కమ్మేస్తూ ఫ్లెక్సీలు చుట్టుముట్టాయి. దీంతో ట్రాఫిక్ సిబ్బంది సెల్లో విధులు నిర్వహించలేక గాలి, వానా, ఎండకు ఇబ్బందులు ఎదుర్కొంటూ బయటే నిలబడి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల సౌకర్యం, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన సెల్కు అడ్డంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా వాటిని తొలగించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ లేమితో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు.
రాజకీయ నాయకులు, ఇతరులు ప్రచార ఆర్భాటంలో భాగంగా ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా వాటిని తొలగించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల అతి ఉత్సాహం కలిసి ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ట్రాఫిక్ సెల్ను కమ్మేసేలా ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని, ఇతరులెవరూ తిరిగి ఏర్పాటు చేయకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన స్థానికులు కోరుతున్నారు.