పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా టికెట్ల విషయంలో చాలా రచ్చ జరుగుతుంది. తెలంగాణలో అంతా ప్రశాంతంగా ఉంది కానీ ఏపీలో మాత్రం ఈ చిత్రం వెనక చాలా వివాదాలు రన్ అవుతున్నాయి. ముఖ్యంగా టికెట్ల ధరలు పెంచడంపై సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. డిస్ట్రిబ్యూటర్లు కూడా డివిజన్ బెంచ్ కోర్టును ఆశ్రయించారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. మూడు రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయినా కూడా వకీల్ సాబ్ టికెట్ల ధరల విషయంలో రచ్చ జరుగుతూనే ఉంది. ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టే ఇన్ని తిప్పలు పెడుతున్నారని.. కావాలనే పవర్ స్టార్ సినిమాను అడ్డుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
సినిమా విడుదలైన మొదటి వారంలో టికెట్ ధరలు అవకాశం అన్ని సినిమాలకు ఉంది. ఏప్రిల్ 2న విడుదలైన అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్, కార్తి సుల్తాన్ సినిమాలు కూడా టికెట్ల ధరలు పెంచాయి. 100 రూపాయల టికెట్ కాస్తా 150 చేసి అమ్ముకున్నారు. కానీ ఆ సినిమాలు విడుదలైన ఒక్క వారానికే అంతా మారిపోయింది. కరోనా నేపథ్యంలో బెనిఫిట్ షోలు, అదనపు షోలు రద్దు చేయడం వరకు ఓకే కానీ.. టికెట్ల రేట్లు విషయంలో షరతులు విధించడం చర్చనీయాంశంగా మారుతుంది. టికెట్ల రేట్ల మీద ప్రభుత్వం తీరు రాజకీయ కక్షగానే చూస్తున్నారు అభిమానులు.టికెట్ బుకింగ్ యాప్లో ఒకే థియేటర్లో వకీల్ సాబ్కు ఒక రేటు, వైల్డ్ డాగ్కు ఒక రేటు ఉన్న స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఇదేం న్యాయం అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గుంటూరులోని నాజ్ థియేటర్లో వైల్డ్ డాగ్ సినిమాకు గోల్డ్ క్లాస్ రేటు 150 రూపాయలు ఉండగా.. అదే థియేటర్లో వకీల్ సాబ్ గోల్డ్ క్లాస్ టికెట్ రేటు రూ.110గా ఉంది. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై కావాలనే జగన్ సర్కారు కక్ష గట్టినట్లే అని పవన్ ఫ్యాన్స్ నిర్ణయానికి వచ్చేశారు. అయితే ఈ ప్రభావం రాబోయే సినిమాల విషయంలో కూడా ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. లేదంటే కేవలం వకీల్ సాబ్ సినిమాకు మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి