తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా కూడా ఓ పెద్ద సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే చాలు కచ్చితంగా వాటి చుట్టూ కాంట్రవర్సీలు అలుముకోవడం కామన్ అయిపోయింది. కొన్నిసార్లు మాత్రం ఎక్కడో జరిగిన సంఘటనల ప్రభావం కూడా ఇక్కడి సినిమాలపై చూపిస్తుంటాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, రానా దగ్గుబాటి విరాటపర్వం సినిమాలపై కూడా ఇలాగే జరుగుతోంది. ఛత్తీస్గఢ్లో ఇటీవల మావోయిస్టులు సృష్టించిన మారణకాండ ప్రభావం ఇప్పుడు ఈ రెండు సినిమాలపై పడింది. ఈ ఘటన కారణంగా రెండు వారాల గ్యాప్తో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాలకు అడ్డంకులు ఎదురయ్యాయి. నక్సల్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాల రిలీజ్కు అనుమతి ఇవ్వకూడదని యాంటీ టెర్రరిజం ఫోరం హైదరాబాద్ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు కూడా చేసింది.
ఛత్తీస్గఢ్లో ఇటీవల మావోయిస్టుల సృష్టించిన రక్తపాతంలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో నక్సల్స్ నేపథ్యంలోనే ఆచార్, విరాటపర్వం సినిమాలు వస్తుండటంతో ఛత్తీస్గఢ్ ఘటనతో వీటికి లింక్ పెడుతున్నారు. ఆచార్య సినిమాలో చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా నక్సలైట్గా నటిస్తున్నాడు. రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో వస్తున్న విరాటపర్వం సినిమాలో రవన్న పాత్రలో రానా కనిపించబోతున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 ప్రాంతంలో జరిగే కథ ఇది. ఈ రెండు సినిమాల్లోనూ నక్సలిజం ఉంది. దీంతో ఈ సినిమాలను ఆపేయాలని యాంటీ టెర్రరిజం ఫోరం డిమాండ్ చేస్తోంది. పోలీసులు, ఆర్మీ అధికారుల ప్రాణాలు తీసే నక్సలైట్లు, మావోయిస్టులు మీకు హీరోల్లా కనిపిస్తున్నారా అని యాంటీ టెర్రరిజం ఫోరం ప్రశ్నిస్తోంది. ఇలాంటి సినిమాలను అస్సలు ప్రోత్సహించకూడదని కోరింది.
ఏప్రిల్ 30న విరాటపర్వం, మే 13న ఆచార్య సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాల విడుదలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. యాంటీ టెర్రరిజం ఫోరం డిమాండ్తో కాకపోయినా.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అయినా కూడా ఈ రెండు సినిమాలు వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి