హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హోంక్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలడంతో వైద్యుల సూచన మేరకు ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఈ మేరకు ఆదివారం జనసేన పార్టీ ఆదివారం ప్రెస్నోట్ విడుదల చేసింది.
‘జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజులుగా ఆయన సిబ్బందిలో ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన హోం క్వారంటైన్లోకి వెళ్లారు. రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు’ అని ప్రకటనలో తెలిపింది.
పవన్ కల్యాణ్ నటించిన చిత్రం ‘వకీల్సాబ్’ రెండురోజుల కిందట విడుదలవగా.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మరో వైపు చిత్రంలో నటించిన నివేదా థామస్ ఈ నెల 3న కరోనా పాజిటివ్గా పరీక్షించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ వ్యక్తిగత సిబ్బంది వైరస్ బారినపడడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.