న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో కూచ్ బిహార్ జిల్లాలో హింస చెలరేగింది. ఇందులో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో రాజకీయ నాయకుల పర్యటపై ఆంక్షలు విధించింది. రాబోయే మూడు రోజుల పాటు జిల్లాలో ప్రవేశించకుండా నిషేధం విధించింది. అలాగే ఐదో విడత ఎన్నికల ప్రచార సమయాన్ని తగ్గించింది. ఎన్నికలకు ముందు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉండగా.. దాన్ని 72 గంటలకు పెంచింది. శనివారం ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతాన్ని ఆదివారం సందర్శిస్తానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తృణమూల్ కాంగ్రెస్ నిర్ణయించింది. జిల్లాలో 72 గంటల పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుపాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ జనరల్ అబ్జర్వర్, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్, బెంగాల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ను ఆదేశించింది. ఓ తప్పుడు వార్తతో స్థానిక, ముఠా భద్రతా దళాలపై దాడి చేయడంతో కూచ్బెహార్లోని పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణలు జరిగాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. సితాల్కుచిలోని పోలింగ్ బూత్ సమీపంలో అనారోగ్యంతో ఉన్న బాలుడికి కేంద్ర బలగాలు సహాయం చేస్తున్న క్రమంలో కొంత మంది స్థానికులు బాలుడిని కొట్టారని భావించి దాదాపు 300 -350 మంది గ్రామస్తులు గుమిగూడారని ఎన్నికల ప్యానెల్ తెలిపింది.
అపార్థం కారణంగా ఓ ముఠా భద్రతా బలగాలపై దాడులకు దిగడంతో పాటు తుపాకులు లాక్కునేందుకు ప్రయత్నించారని ప్యానెల్ పేర్కొంది. ఘర్షణ జరిగిన నేపథ్యంలో సితాల్కుచిలో పోలింగ్ నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ ఘటనతో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. సంఘటన ‘ప్రణాళికాబద్దమైన దాడి’, కేంద్రం హోంశాఖ ‘హత్య’ అని సీఎం మమతా ఆరోపించారు. హింసకు మమతనే కారణమని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై బెంగాల్ సీఐడీ విచారణ జరుపుతుందని సీఎం మమత పేర్కొన్నారు.