తిరుమలగిరి జూలై 30: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం మెట్ట పంటలకు జీవం పోసింది. ప్రస్తుత వానకాలం సీజన్లో మొదటగా కురిసిన వర్షం ఇదే కావటం విశేషం. రైతులు మెట్ట పంటలైన కంది, పెసర, మినుమలు, బొబ్బర్లు, వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. కాగా గత రెండు నెలలుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేక మెట్ట పంట లు సైతం వాడిపోతుండటంతో రైతులు ఆందోళనలో పడిపోయారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్న క్రమంలో బుధవారం రాత్రి కురిసిన వర్షం పం టలకు జీవం పోసింది. తుంగతుర్తి నియోజకవర్గంలో ఈ సారి అత్యధికంగా ఆరుతడి పంటలైన కంది 1262 ఎకరాలు, పెసర 1053 ఎకరాలు ,మినుములు 32 ఎకరాలు, బొబ్బర్లు 28 ఎకరాల్లో సాగు చేశారు.
వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ..
వర్షం పడటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై కనిపిస్తున్నారు. పంటలను సంరక్షించుకోవటం కోసం రైతులు ఇప్పటికే కలుపు తీయించి, గుంటకాలు తోలి, ప్రస్తుతం కురిసిన వర్షాలతో మొక్కలకు డీఏపీ లాంటి మందులు చల్లటంలో బీజీగా ఉన్నారు. చేలల్లో కలుపు తీయించి పంటలను రక్షించుకోవటంలో నిమగ్నమయ్యారు. కురిసిన కొద్దిపాటి వర్షంతో పంటలను కాపాడు కోవాలని చూస్తున్నారు.
వరి సాగుపై ఆశలు..
వర్షాలు కురవడంతో రైతులకు వరి సాగుపై ఆశలు చిగురించాయి. వచ్చే నెలలో వర్షాలు కురిస్తే వరి సాగు, చేయటానికి రైతులు ఇప్పటికే నార్లు వేసి బురద మళ్లు దున్ని సిద్ధం గా ఉంచారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే బోర్ల కింద 1,31,334 ఎకరాలు సాగు కాగా, మరో లక్ష ఎకరాలు మాత్రమే సాగయ్యే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఎస్సారెస్సీ కింద 2,21 ,609 ఎకరాల ఆయకట్టు ఉండగా వెనుకబడిన తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి,తిరుమలగిరి, జాజిరెడ్డి గూడెం, నూతనకల్, మద్దిరాల, నాగారం మండలాల్లో 1.50 ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వల ద్వారా సాగు నీరు అందకపోతే నియోజకవర్గంలో వరి సాగు ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంది.
సాగవుతున్న మెట్ట పంటలు..
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ సారి రెండు వేల ఎకరాలకు మించి ఆరుతడి పంటలు సాగు కాలేదు. ఇందుకు ప్రధాన కారణం ప్రతికూల వాతావరణం, కోతులు బెడద అని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యం లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి 1,31,334 ఎకరాల్లో సాగు కాగా..పత్తి 7,28,083 ఎకరా ల్లో సాగైంది. జల్లాల వారీగా సాగు విస్తీర్ణం పరిశీలిస్తే నల్లగొండ జిల్లాలో వరి 27,556 ఎకరా ల్లో కాగా పత్తి 5,56,630 ఎకరాల్లో సాగైంది. అలాగే సూర్యాపేట జిల్లాలో వరి 12,252 ఎకరాల్లో సాగు కాగా..పత్తి 77,337 ఎకరాల్లో సాగైంది. తుంగతుర్తి నియోజక వర్గంలో జిల్లాలోని సగంశాతం ఆరుతడి పంటలు సాగయ్యా యి. తుంగతుర్తి నియోజక వర్గంలో పత్తి సాగు ను పరిశీలిస్తే 33,262 ఎకరాల్లో సాగైంది. అంటే జిల్లాలో 50 శాతం పత్తి, అదే విధంగా మెట్ట పంటలు నియోజక వర్గంలోనే సాగయ్యాయి. మండలాల వారీగా పత్తి పంటను పరిశీలిస్తే తిరుమలగిరిలో 9,105 ఎకరాలు, జాజిరెడ్డిగూ డెంలో 2,175 ఎకరాలు, మద్దిరాల మండలంలో 5,150 ఎకరాలు, నాగారం మండలంలో 5,750 ఎకరాలు, నూతనకల్ మండలం లో 7,100 ఎకరాలు, తుంగతుర్తి మండలంలో 3,982 ఎకరా ల పత్తి సాగైంది.
జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షపాతం
ప్రస్తుత సీజన్లో తుంగతుర్తి నియోజక వర్గంలోనే జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదైంది. నియోజక వర్గంలోని తిరుమలగిరిలో అత్యధికంగా 24.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అతి తక్కువగా అనంతగిరి మండలంలో 0.4 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. నియోజక వర్గంలోని మిగతా మండలాల వారీగా బుధవారం కురిసిన వర్షపాతాన్ని పరిశీలిస్తే తిరుమలగిరిలో 24.8 మిల్లీ మీటర్లు, జాజిరెడ్డిగూడెంలో 22.3, నాగారంలో 17.9, మద్దిరాలలో 17.8, తుంగతుర్తిలో 17.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఈ వర్షం పంటలకు ఆసరా అయితది..
ఎన్నో రోజులుగా వర్షం కోసం ఎదురు చూస్తున్నం.. మెట్ట పంటలు కూడా ఎండిపోవటం ఇదే మొదటి సారి. ఇంత దారుణంగా కరువు ఛాయలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాలేదు. ప్రస్తుతం కురిసిన వర్షం వల్ల మెట్ట పంటలకు ప్రాణం వచ్చింది. ఇలాగే అడపాదడపా వర్షాలు కురిస్తే తప్ప మెట్ట పంటలు చేతికందే అవకాశం లేదు. నెల రోజులుగా వర్షం ముఖం చాటేస్తే మెట్ట పంటపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ సారి కాలం రైతులకు కలిసొస్తదో లేదో చూడాలి.
-దేవేందర్, రైతు, నెల్లిబండ తండా, తిరుమలగిరి