న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. రోజులు గడిచినా కొద్ది వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్న కేసులు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,52,879 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా మరో 839 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,58,805కు చేరాయి.
తాజాగా 90,584 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1,20,81,443 మంది కోలుకోగా.. వైరస్ బారినపడి మొత్తం 1,69,275 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 11,08,087 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. టీకా డ్రైవ్లో 10,15,95,147 డోసులు వేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 14.12లక్షల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 25.66 టెస్ట్లు నిర్వహించినట్లు వివరించింది.