Revanth Reddy : దేశంలోని 28 రాష్ట్రాల్లో 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులున్నాయి. అత్యధిక కేసులున్నది మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపైనే. దేశంలోని సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులు, వారిపై తీసుకునే చర్యలపై అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారీ రూపొందించిన 96 పేజీల నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వారిపై చర్యలు తీసుకునే అంశంపై ఈ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశారు.
జూలై, 2026 నాటికి ఉన్న కేసులకు సంబంధించిన వివరాలివి. ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని 28 మంది సీఎంలలో 14 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 89 కేసులతో సీఎం రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి 29 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ చెరో 19 కేసులతో మూడో స్తానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా కేరళ సీఎం వీడీ సతీషన్ 18 కేసులు, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ 5 కేసులు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ చెరో 4 కేసులు, తమిళనాడు సీఎం విజయ్, బిహారీ సీఎం సామ్రాట్ చౌదరి చెరో 2 కేసులు కలిగి ఉండగా, సిక్కిం సీఎం పీఎస్ తమాంగ్, పంజాబ్ సీఎం భగవంత్ మన్, ఒడిశా సీఎం మోహన చరణ్ మాంఝీ, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఒక్కో కేసు కలిగి ఉన్నారు. దేశంలోని ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 క్రిమినల్ కేసులున్నాయి.
అత్యధికంగా యూపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై కలిపి 1,171 క్రిమినల్ కేసులున్నాయి. బెంగాల్లో 292 మంది ఎమ్మెల్యేలలో 170 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. తెలంగాణలో 17 మంది ఎంపీలలో 11 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. రాజ్యసభలో 233 మంది సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్ కేసులు దాఖలయ్యాయి. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై భారీ స్తాయిలో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నందున వాటి విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హన్సారియా సుప్రీంకోర్టును కోరారు. అలాగే, హైకోర్టులు ఈ విచారణను నిరంతరం పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.