Tamannaah | అగ్ర కథానాయిక తమన్నాపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాస్పద ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ ప్లాట్ఫామ్ మహాదేవ్కు అనుబంధ యాప్గా ఉన్న ఫెయిర్ ప్లే కోసం తమన్నా ప్రచారకర్తగా పనిచేసింది. ఈ యాప్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లను ప్రసారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అధికారిక బ్రాడ్కాస్టింగ్ సంస్థ జియో సినిమా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తమన్నాపై ఫిర్యాదు చేసింది. ఫెయిర్ ప్లే యాప్లో ఐపీఎల్ మ్యాచ్లు చూడమని తమన్నా చెప్పడం నిబంధనలకు విరుద్ధమని జియో సినిమా తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ కైంప్లెంట్ను స్వీకరించిన ముంబయి సైబర్ పోలీసులు వచ్చే వారం విచారణకు హాజరుకావాలని తమన్నాకు సమన్లు జారీ చేశారు. మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్పై గత కొంతకాలంగా వివాదం నడుస్తున్నది. ఈ యాప్ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసి దర్యాప్తుని నిర్వహిస్తున్నది. ఈ యాప్ కోసం ప్రచారం నిర్వహించిన రణ్బీర్కపూర్, శ్రద్ధాకపూర్కు ఈడీ గతంలోనే సమన్లు జారీ చేసి విచారణ చేపట్టింది. తాజాగా తమన్నాపై కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది.