తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మళ్లీ థియేటర్లు మూత పడతాయని లేదంటే కచ్చితంగా 50% ఆక్యుపెన్సీ వస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. దేశంలో కరోనా రెండో దశ మొదలైంది.. మొదటి దశ కంటే దారుణంగా ఇది వ్యాపిస్తుంది. అప్పట్లో రోజుకు 90 వేల కేసులు వస్తేనే అమ్మో అనుకున్నారు. కానీ ఇప్పుడు లక్ష 50 వేలు దాటిపోయాయి. అందుకే ప్రభుత్వాలు మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ క్షణమైనా మళ్లీ థియేటర్ల బంద్ పడే లేదా 50 శాతం ఆక్యుపెన్సీ అమలులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
ఎందుకంటే మన దగ్గర కూడా కేసులు దాదాపు 3,500 వరకు వస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అది మరింత పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ఇష్టపడట్లేదు. అందుకే ఏప్రిల్ 16న రావాల్సిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ను వాయిదా వేశారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నాడు. ప్రమోషన్స్ కూడా మొదలైన తర్వాత ఈ సినిమాను వాయిదా వేశారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న కారణంగానే సినిమాను వాయిదా వేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.
దానికి తోడు పుష్ప, ఆచార్య లాంటి సినిమాలు కూడా వాయిదా పడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీటిని ఏకంగా ఆరు నెలలకు పైగా వాయిదా వేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పుడు విడుదల చేస్తే ఈ సినిమాలను రెండు మూడు వారాల్లోనే కచ్చితంగా ఓటీటీలో విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇష్టం లేని నిర్మాతలు తమ సినిమాలను మరికొంతకాలం వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 15 తర్వాత మళ్లీ థియేటర్ల బంద్ లేదా 50% ఆక్యుపెన్సీ పెడతారని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 30 వరకు ఇది కొనసాగుతోందని తెలుస్తుంది. అందుకే టక్ జగదీష్, విరాట పర్వం లాంటి సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే ముందుంది ముసళ్ల పండగ అనిపించక మానదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి