Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. కమోడిటీ ధరలు సానుకూలంగా ఉండటంతోపాటు ఎస్యూవీ కాల్స్ పుంజుకోవడంతో 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో మారుతి సుజుకి నికర లాభం 47.8 శాతం పెరిగింది. 2022-23 మార్చి త్రైమాసికంలో రూ.2,623.6 కోట్ల నికర లాభం గడించిన మారుతి సుజుకి.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.3,877.8 కోట్ల నికర లాభం పొందింది. ఈ నేపథ్యంలో వాటాదారులకు షేర్పై అత్యధికంగా రూ.125 డివిడెండ్ ఇవ్వాలని మారుతి సుజుకి డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. గతేడాది షేర్ పై రూ.90 డివిడెండ్ చెల్లించింది.
2022-23 మార్చి త్రైమాసికంతో పోలిస్తే 2023-24లో ఎస్యూవీ, మల్టీ పర్పస్ వెహికల్స్ 1.81 లక్షలు అమ్ముడయ్యాయి. మొత్తం కార్ల విక్రయాల్లో 71.5 శాతం వాటా వీటిదే. 2023 మార్చి త్రైమాసికంలో 24 శాతం పెరిగిన ఎస్యూవీ, మల్టీ పర్పస్ వెహికల్స్.. 2023-24 మార్చి త్రైమాసికంలో 36 శాతం పెరిగాయి. కంపెనీ నికర విక్రయాల విలువ రూ.30,821.8 కోట్ల నుంచి రూ.36,697.5 కోట్లకు పెరిగింది.
2022-23తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి లాభం 64 శాతం పుంజుకుని రూ.13.209.4 కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి నెలాఖరు వరకూ సేల్స్ 20 శాతం పెరిగి రూ.1,34,937.8 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తామని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ మీడియాకు చెప్పారు.