ఖమ్మం రూరల్, ఆగస్టు 06 : ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ ఫీల్డ్ హైవేపై దంసలాపురం సమీపంలోని మున్నేరు వంతెన వద్ద గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో తల్లి, కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు చింతకాని మండలం గాంధీనగర్ గ్రామానికి పాపబత్తిని సుజాత (38), పాపబత్తిని పవన్ కుమార్ (17) వారుగా గుర్తించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్కు చెందిన పాపబత్తిని నరసింహారావు అనే వ్యక్తి తన భార్య, కొడుకుతో కలిసి హైదరాబాద్కు కారులో బయల్దేరారు. మున్నేరు వంతెన పై నుండి ప్రయాణం చేస్తున్న సమయంలో హైదరాబాద్ వైపు నుండి వస్తున్న డీసీఎంను అదుపుతప్పి బలంగా ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుజాత, పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన నరసింహారావును ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి విచారణ చేపట్టారు.

ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవేపై రోడ్డు ప్రమాదం.. తల్లి, కొడుకు మృతి