Shashi Tharoor : విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు-2026 పై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు (Congress Senior Leader), తిరువనంతపురం ఎంపీ (Thiruvanantapuram MP) శశి థరూర్ (Shashi Tharoor) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విదేశీ నిధుల నియంత్రణ పేరిట కేంద్రం తెస్తున్న ఈ సవరణల వల్ల పారదర్శకత పెరగకపోగా.. దేశంలోని విద్యా సంస్థలు, ఆసుపత్రులు, సేవా సంస్థలను నడిపే సామాజిక వర్గాలు, ముఖ్యంగా మైనారిటీలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం విపరీతమైన అధికారాలను తన చేతుల్లోకి తీసుకుంటోందని థరూర్ ఆరోపించారు. ఏదైనా సంస్థకు చెందిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరణ కాకపోతే లేదా రద్దయితే ఆ విదేశీ నిధులతో దశాబ్దాలుగా నిర్మించిన ఆస్తులను, ఆసుపత్రులను, పాఠశాలలను స్వాధీనం చేసుకునే లేదా విక్రయించే అధికారాన్ని ప్రభుత్వం సొంతం చేసుకోవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. నియంత్రణ పేరుతో పౌర సమాజాన్ని, స్వచ్ఛంధ సంస్థలను క్రమంగా దెబ్బతీయడంవల్ల అంతిమంగా నష్టపోయేది సామాన్య భారతీయులేనని పేర్కొన్నారు.
ఈ బిల్లును వెంటనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని, లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా తీవ్ర నిరోధకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టంచేశారు.