అమరావతి : కన్నతల్లి లాంటి సినిమా పరిశ్రమను వదిలి డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ (Pawan Kalyan) వెల్లడించారు. కోనసీమ జిల్లా మలికిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ ప్రసంగించారు. ప్రజల కష్టాలు తీర్చడానికి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. వైసీపీ(YCP) ఐదేండ్ల ఆరాచక పాలన నుంచి ఏపీని విముక్తి చేయడానికి కూటమిగా ఏర్పడ్డామని స్పష్టం చేశారు.
జగన్పై చిన్న గులకరాయి పడితేనే యువకుడిని అరెస్టు చేసి కేసుపెట్టారని, దళితుడిని చంపి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుపై మాత్రం చర్యలు లేవని ఆరోపించారు. జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని విమర్శించారు. ఎన్డీయే(NDA) కూటమి ప్రభుత్వం రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. రైతులకు మద్దతు ధర ఇప్పించేందుకు బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు.