Virinchi Hospitals Chairperson Kompella Madhavi Latha | ఆ తల్లి తొమ్మిదేండ్లు వచ్చేవరకు పిల్లలను బడికి పంపలేదు. ఎదిగే క్రమంలో కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. సరైన దిశలో ప్రోత్సహిస్తే పిల్లలు అద్భుతంగా ఆలోచిస్తారని విశ్వసించారు. ఇద్దరు బిడ్డలకూ ఇంటి దగ్గరే చదువు చెప్పి, విలువలు నేర్పి, వ్యక్తిత్వం నిర్మించి.. చిరుప్రాయంలోనే ఐఐటీలో ప్రవేశం పొందేలా తీర్చిదిద్దారు హైదరాబాద్లోని విరించి హాస్పిటల్స్ చైర్ పర్సన్ కొంపెల్ల మాధవీలత.
మాధవీలత కోఠి మహిళా కళాశాల, నిజాం కళాశాలల్లో చదువుకున్నారు. రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. వ్యాపారవేత్త విశ్వనాథ్ కొంపెల్లతో వివాహం తర్వాత వివిధ ఉద్యోగాలు చేశారు. అవేవీ ఆమెకు సంతృప్తిని ఇవ్వలేదు. దాంతో మధు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పేరుతో సొంత సంస్థను స్థాపించారు. కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ప్లే స్కూల్ మొదలు ఇంటర్ వరకు ఎంతో మంది విద్యార్థులను పరిశీలించారు. బళ్లో ఉపాధ్యాయులు ఏం చెప్పినా మూడు నుంచి పన్నెండేండ్ల పిల్లలు నమ్మేస్తారని గ్రహించారు. అదే తల్లిదండ్రులు చెప్పేదైతే బుద్ధి తెలిసినప్పటి నుంచే నమ్మడం మొదలుపెడతారు. అయితే, పిల్లల నమ్మకాన్ని పెద్దలూ ఉపాధ్యాయులూ ఎలా వమ్ము చేస్తున్నారన్నది ఆమెకు అర్థమైపోయింది. వాళ్లకు చదువుతోపాటు స్వేచ్ఛ కూడా అవసరమని భావించారు. స్వేచ్ఛను ఇస్తూనే వ్యక్తిత్వం, విలువల గురించి నేర్పించవచ్చని గుర్తించారు. కన్నవారి నుంచే మార్పు ప్రారంభం కావాలని మాధవీలత, విశ్వనాథ్ దంపతుల నిశ్చితాభిప్రాయం.
తమ పిల్లలు ఏడవకుండా బడికెళ్లాలన్నది మాధవీలత దంపతుల కోరిక. ఏడిస్తే బడి మానిపించేద్దామనే అనుకున్నారు. పిల్లల స్వేచ్ఛకు ఆటంకం కలిగించకూడదని నిర్ణయించుకున్నారు. ఓపికతో వారిని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దవచ్చని నమ్మారు. ఆ ఆలోచనతోనే ముగ్గురు పిల్లల కోసం ఇంటినే పాఠశాలగా మార్చారు. 9 ఏండ్ల వరకు పిల్లలు ఏం చేయాలనుకుంటే అది చేయనిచ్చారు. రామాయణం, మహాభారతం, పంచతంత్ర కథల ద్వారా వ్యక్తిత్వ ప్రాధాన్యాన్ని ఉగ్గుపాలతో నూరిపోశారు. పిల్లల సందేహాలను తీర్చడానికి తానే ఓ విద్యార్థినిగా మారారు మాధవీలత. చదువులో కళలు, ఆటలను ఓ భాగం చేశారు. ఆ ప్రయోగం ఫలించింది. పద్నాలుగేండ్ల వయసులోనే పిల్లలిద్దరూ ఐఐటీలో ప్రవేశం పొందారు.. అదీ ఒత్తిడిలేని చదువుతో, వికాసంతోకూడిన విద్యతో.
మాధవి దంపతుల మొదటి సంతానం లోపాముద్ర. పాపను మూడో ఏట బడిలో చేర్చేందుకు సిద్ధమయ్యారు. కానీ మూడు రోజుల తర్వాత బడికి వెళ్లనని మారాం చేసింది. దీంతో బడి మానిపించారు. తొమ్మిదేండ్లు వచ్చే వరకు లోపాముద్రతోనే ఎక్కువ సమయం గడిపారామె. బిడ్డ స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకున్నారు. చుట్టాలు, స్నేహితుల నుంచి ఒత్తిడి ఎదురైనా పట్టించుకోలేదు. ఇంట్లోనే సామాన్య, సాంఘిక శాస్త్రాలను బోధించారు. తండ్రి విశ్వనాథ్ తరచూ లెక్కలు చెప్పేవారు. ఆ దంపతులు ఆధ్యాత్మిక, నైతిక అంశాలనూ కూతురికి పరిచయం చేశారు. 9 ఏండ్లు రాగానే ప్రైవేటు ఉపాధ్యాయుణ్ని నియమించుకున్నారు. అప్పటికే లోపాముద్రకు చాలా అంశాల మీద లోతైన అవగాహన వచ్చేసింది. దీంతో ఆ అమ్మాయికి పాఠం చెప్పడం తనవల్ల కాదని ఆ టీచర్ మొరాయించారు. 14 ఏండ్ల ప్రాయంలోనే లోపాముద్ర ప్రతిష్టాత్మక చెన్నై ఐఐటీలో సీటు సాధించింది. అంతేకాదు, ఐఐటీలో ప్రవేశం పొందిన అతిపిన్న వయస్కురాలిగా నిలిచిపోయింది. మాధవి, విశ్వనాథ్ దంపతుల రెండో సంతానం రామకృష్ణ పరమహంస కూడా చెన్నై ఐఐటీలో సీటు సాధించాడు.
మాధవీలతది సంపన్న కుటుంబం. కానీ ఆమె తన పిల్లలకు ఇంటి పనులన్నీ నేర్పించారు. ఇంట్లో పనిచేసే వారిని, సంస్థ ఉద్యోగులను ఎలా గౌరవించాలన్నది బోధించారు. పడుకోవడం కూడా మామూలు బొంతపైనే. డబ్బు ఉన్నప్పుడు ఎన్ని సౌకర్యాలు ఉంటాయి, డబ్బు లేనప్పుడు ఎలా ఉండాలన్న విషయం ఎరుకపరచడానికే ఇదంతా చేశారు. అమ్మమ్మలు, నానమ్మల కాలపు జీవన విధానాన్నీ వివరించారు. రోజూ పిల్లలతో 3 నుంచి 4 గంటలపాటు మాట్లాడతారామె. వాళ్లిప్పుడు సొంతంగా ఆంగ్ల, తెలుగు భాషల్లో కవిత్వం రాయగలుగుతున్నారు.
పిల్లలు బాగుపడాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు మరొకరితో పోలుస్తారు. ఆ పోలిక పిల్లల మనసులకు గుచ్చుకుంటుంది. పిల్లలకు సొంతంగా ఆలోచించే స్వేచ్ఛనివ్వాలి. ఆ ఆలోచనకు మనం అండగా నిలవాలి. అప్పుడే అద్భుతాలు చేయగలుగుతారు. అయితే దీనికి భిన్నంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఇంటికి రాగానే హోంవర్క్ ఏం ఇచ్చారు, తరగతిలో ఎలా ప్రవర్తిస్తున్నారన్న దానిపై దృష్టిసారిస్తారు. దీంతో పిల్లల్లో భయం పెరిగిపోతుంది. అది చదువుపైనా ప్రభావం చూపుతుంది. చదువంటే ఆసక్తి పోతుంది. మనసు చంచలంగా మారిపోతుంది. కాబట్టి, బడిలో పిల్లలకు ఆనందం కలిగించిన విషయాలు ఏమైనా ఉన్నాయా అన్నది అడగాలి. అప్పుడే, తమంతట తామే హోంవర్కు గురించి చెబుతారు. ఈ సూత్రాన్ని తన పిల్లల విషయంలో పాటించి నూటికి నూరుపాళ్లు విజయం సాధించానని గర్వంగా చెబుతారు మాధవీలత. పిల్లల ముందు పెద్దలు తమ బాధ్యతను మరిచి ప్రవర్తించవద్దని ఆమె సలహా ఇస్తున్నారు. ‘పిల్లల ఆలోచనలకు గౌరవం ఇచ్చి, వారి మెదళ్లలో మంచిని, ప్రేమను, ఓపికను నింపాలి. అలాచేస్తే మంచి పౌరులుగా, శక్తిమంతులుగా తయారవుతారు’ అంటారు మాధవీలత.
మా సంస్థలో దాదాపు 1,400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రతి ఉద్యోగికి పూర్తి స్వేచ్ఛను ఇస్తాం. వారి పిల్లల చదువు, ఆరోగ్యం కోసం అవసరమైన సహాయం అందిస్తాం. మా కుటుంబసభ్యులుగా భావిస్తాం. మా దవాఖానకు వచ్చే రోగులకు కూడా అన్ని సౌకర్యాలను కల్పిస్తాం. పేదవారికి తగిన రాయితీ ఇస్తున్నాం. త్వరలోనే, ఉద్యోగాలు చేస్తున్న తల్లుల పిల్లల కోసం చెన్నైలో ఓ పాఠశాలను ప్రారంభించబోతున్నాం.
– మాధవీలత, చైర్ పర్సన్, విరించి హాస్పిటల్స్
✍ గొట్టిముక్కల సుధాకర్ గౌడ్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
భీమ్లా నాయక్ సినిమాలో పాట పాడిన దుర్గవ్వ ఎవరో తెలుసా
విజయ్ దేవరకొండ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు : ఇండియన్ ఐడల్ సింగర్ షణ్ముఖ ప్రియ
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..
gongadi trisha | క్రికెట్లో యువ సంచలనం మన తెలంగాణ అమ్మాయి త్రిష..
Matilda Kullu | వ్యాక్సిన్లు వేసే ఆశావర్కర్ ఫోర్బ్స్ జాబితాలోకి.. ఎలా సాధ్యమైంది?