Keerthi priya | పండించిన కాయగూరలకు గిట్టుబాటు ధర లభించక, కనీసం కూలీల ఖర్చుకూడా రాక, మార్కెట్లోనే నిర్దాక్షిణ్యంగా పంటను పారవేసే దృశ్యాలను కండ్లారా చూసిందామె. ఈ సమస్యకు పరిష్కారం చూపలేమా? అన్న అంతర్మథనం నుంచి ఓ వ్యాపార సూత్రం ప్రాణం పోసుకుంది. అటు రైతులకు, ఇటు తమకు ఎలాంటి నష్టమూ లేకుండా మధ్యే మార్గంగా ఓ సంస్థను స్థాపించింది ఓడపల్లి కీర్తిప్రియ.
బిట్స్ పిలానీలో బీఫార్మసీ తర్వాత, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) కోల్కతాలో ఎంబీఏ. 27 ఏండ్లకే ముంబైలో రూ.27 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం. నాన్న కానిస్టేబుల్, అమ్మ గృహిణి. అందమైన కుటుంబం. సంతోషంగా గడుస్తున్న రోజులు. ఆయినా ఏదో అసంతృప్తి. కండ్లముందే పంటను పారేసుకున్న రైతుల వెతలు, గిట్టుబాటు ధర లేక పొలాల్లోనే పంటను మురగ
బెట్టుకున్న రైతుల గాథలు కీర్తిప్రియను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. దీంతో, ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగాన్ని వదులుకొని వ్యవసాయ మూలాలున్న.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం, తొండ గ్రామానికి వచ్చేసింది కీర్తిప్రియ. రైతుల సమస్యకు పరిష్కారం వెతుకుతూ.. తొలి అడుగుగా డ్రై ఫుడ్ వ్యాపారం ప్రారంభించింది. వందలాది మంది మహిళలకు ఉపాధి అందించడంతోపాటు, రైతన్నలకు మేలు చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నారు కీర్తి, ఆమె తల్లి విజయలక్ష్మి.
తాను ఉపాధి పొందుతూనే, స్వగ్రామంలో పది మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంలో ఎకరం స్థలంలో రూ.1.36 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు శ్రీకారం చుట్టింది కీర్తి. ఈ యూనిట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వందలాది మందికి ఉపాధి దొరకడంతో పాటు.. రైతుల పంటకు సరైన ధర కూడా లభిస్తుంది. కూరగాయలకు, పండ్లకు ధరలు లేని సమయంలో వాటిని వృథాగా పారవేయకుండా నేరుగా ఇక్కడ విక్రయిస్తే.. డ్రై ఫ్రూట్స్గా, డ్రై వెజిటెబుల్స్గా మార్చి ఇతర రాష్ర్టాలు, దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం 20 రకాల కూరగాయలు, 10 రకాల పండ్లను ఎగుమతి చేస్తున్నారు కూడా. ఇవి రెడీ-టు-కుక్, రెడీ-టు-ఈట్ ఉత్పత్తులుగా ఉపయోగపడతాయి.
కీర్తిప్రియ బెంగళూరులో ఉన్నప్పుడు తల్లి విజయలక్ష్మి మామిడి, చిక్కుడు, బొప్పాయి, బచ్చలి, గోంగూర, టమాట, క్యాబేజి వంటివి ఎండబెట్టి పచ్చళ్లు చేసి పంపించేది. వాటిని తిన్న కీర్తి స్నేహితులు ఎంతో మెచ్చుకునేవారు. అలా డ్రై ఫుడ్ విలువ తెలుసుకున్న కీర్తికి.. రైతులకు మేలు చేసేవిధంగా డ్రై వెజిటబుల్స్ వ్యాపారం చేద్దామనే ఆలోచన వచ్చింది. 2018లో తల్లి విజయలక్ష్మితో కలిసి ‘నర్చర్ ఫీల్డ్స్ ఇండస్ట్రీస్’ పేరుతో వ్యాపారం ప్రారంభించింది. సంప్రదాయ పద్ధతుల్లో కాయగూరలు, పండ్లను ఎండబెట్టి అమెజాన్, ఇండియా మార్ట్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్స్ ద్వారా విక్రయిస్తున్నారు. డ్రై ఫుడ్కు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉండటంతో.. డ్రై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను నెలకొల్పారు. ‘వీ-హబ్’లో సభ్యత్వం కూడా పొందారు కీర్తిప్రియ. దీంతో ప్రభుత్వం తరఫున అందాల్సిన అన్ని సహాయ, సహకారాలు అందుతున్నాయి. వీ-హబ్తో కలిసిన తర్వాత పరిశ్రమలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కస్టమర్లను సంపాదించుకోగలిగారు.
ఏటా దేశవ్యాప్తంగా పంటల కోత తర్వాత మార్కెట్ సౌకర్యం లేక, ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల.. ఇలా రకరకాల కారణాలతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. అందుకే మేం స్థానిక రైతుల నుంచి పంట కొనుగోలు చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఆహార ఉత్పత్తుల వృథాను తగ్గించడమే మా డ్రై ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లక్ష్యం. తమ పంటలకు సరైన ధర రాని పక్షంలో రైతులు ఇక్కడ అమ్ముకోవచ్చు. డ్రై వెజిటెబుల్స్, ఫ్రూట్స్తో పచ్చళ్లు, జ్యూస్, మిక్స్డ్ జ్యూస్ వంటివి తయారుచేస్తున్నాం.
– కీర్తిప్రియ, ఆంత్రప్రెన్యూర్
✍ డప్పు రవి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?
shaik saleema | తెలంగాణలో తొలి ముస్లిం ఐపీఎస్గా షేక్ సలీమా రికార్డ్.. ఆమె బ్యాక్గ్రౌండ్ ఇదీ..
Saami Saami | పుష్పలో సామీ సామీ పాట పాడిన మౌనికకు ఇన్స్పిరేషన్ ఈమెనే
విదేశాలకూ తెలంగాణ రుచులను అందిస్తున్న కరీంనగర్ మహిళలు
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
sheela bajaj | 78 ఏండ్ల వయసులో వ్యాపారం మొదలుపెట్టిన బామ్మ