వర్ని, ఆగస్టు 13 : ‘అన్నం పెట్టినోళ్లను మరుస్తామా? అలా చేస్తే పుట్టగతులుండవు’ అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ని మం డలం జాకోర, శంకోరలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తాను ఉన్నది ఉన్నట్టే మాట్లాడినట్టు తెలిపారు. అందులో రాజకీయమేమీలేదని అన్నారు. మళ్లీ అటుపోతడా? ఇటుపోతడా? అనుకునుడు కాదని, ప్రజలకోసమే తన జీవితం.. ప్రజల సంక్షేమం, కార్యకర్తల బాధలు తీర్చడమే తన ఆలోచన అని పేర్కొన్నారు.
దానికి అనుగుణంగా తాను పనిచేయాల్సి వస్తుందని చెప్పారు. అంతేగాని తనకు ఒక్క శాతం కూడా స్వార్థం లేదని అన్నారు. స్వార్థం అనేది ఉంటే రాజకీయం వదులుకుంటా అని స్పష్టంచేశారు. ‘పోచారం శ్రీనివాసరెడ్డి ఊరికెనే పోయిండా? ముఖ్యమంత్రిని ఊరికే కలిసిండా? ఆయన స్వార్థముంది’ అని అనుకునేవాళ్లు కనీసం ఒక్కటైనా చెప్పాలని డిమాండ్ చేశారు. తనకేమైనా డబ్బులిచ్చారా? తాను అమ్ముడు పోయానా? అది స్పష్టం చేయడానికే తాను వాస్తవం మాట్లాడినట్టు చెప్పారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పడం తన వల్ల కాదని అన్నారు.