నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు –బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) మధ్య నెలకొన్న వివాదం మరో కీలక మలుపు తిరిగింది. 2026 బ్యాచ్ న్యాయ విద్యార్థుల ఎన్రోల్మెంట్పై తొలుత ఆంక్షలు విధించిన బీసీఐ.. గంటల వ్యవధిలోనే వాటిని ఉపసంహరించుకుంది. అయితే విద్యార్థుల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న ఆదేశాన్ని మాత్రం కొనసాగించింది. ఈ నేపథ్యంలో విచారణ నిర్వహించే అధికారం వర్సిటీకి ఉందా? అన్న అంశాన్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందుంచాలని నల్సార్ వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు నిర్ణయించారు.
నల్సార్ 2026 బ్యాచ్ బీఏ, ఎల్ఎల్బీ (ఆనర్స్) విద్యార్థుల స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే అంశంపై విద్యార్థుల్లో ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. సుమారు 450 మంది విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్కు లేఖ రాశారు. ఢిల్లీలో ‘చలో పార్లమెంట్’ సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జీ, బలప్రయోగంపై సీజేఐ చేసిన వ్యాఖ్యలను వారు ప్రస్తావిస్తూ.. ఆయన చేతుల మీదుగా పట్టాలు అందుకోవడం తమ వర్సిటీ నేర్పిన విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యంతరాల వెనుక కొందరు అధ్యాపకులు, బయటివ్యక్తుల ప్రమేయం ఉందన్న అనుమానాలను బీసీఐ వ్యక్తం చేసింది. సీజేఐపై దుష్ప్రచారం వెనుక ఎవరున్నారో గుర్తించి నివేదిక ఇవ్వాలని వీసీని కోరింది. ఈ నేపథ్యంలో బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా.. 2026 బ్యాచ్ విద్యార్థులను న్యాయవాదులుగా నమోదు చేసుకోవద్దంటూ రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కొద్ది గంటల్లోనే ఆ ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. విద్యార్థుల్లో అత్యధికులు ఎలాంటి తప్పూ చేయలేదని బీసీఐ స్పష్టం చేసింది.
అయితే విచారణ అంశం మాత్రం అలాగే ఉండటంతో.. బీసీఐ కోరిన విచారణను నిర్వహించడం వర్సిటీకి రాజ్యాంగబద్ధంగా, పాలనా నిబంధనల ప్రకారం ఉన్న అధికారాల పరిధిలోకి వస్తుందా? అనే అంశాన్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందుంచాలని వీసీ నిర్ణయించారు. వర్సిటీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కౌన్సిల్ పరిశీలన అనంతరం తీసుకునే నిర్ణయాన్ని బీసీఐకి తెలియజేయనున్నారు. దీంతో విద్యార్థుల ఎన్రోల్మెంట్పై ఆంక్షలు తొలగిపోయినా.. బీసీఐ కోరిన విచారణపై నల్సార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

Nalsar University1