రైతుల పేరు చెప్పుకొని మనుగడ సాగించే కాంగ్రెస్ను, ఇప్పుడు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు చేసిన రైతు వ్యతిరేక వ్యాఖ్యలు ఇరుకున పడేశాయి. వ్యవసాయానికి కరంటు మూడు గంటలు చాలు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మాట్లాడడం రైతుల్లో ఆగ్రహం తెప్పించడమే కాకుండా సొంత పార్టీలోనూ మంట పుట్టించింది. రైతుల సంక్షేమం విషయంలోనే కాంగ్రెస్ కీలక నేత చేసిన ప్రేలాపనలు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను అయోమయంలోకి నెట్టాయి. అన్నదాతల అవసరాలు తెలియకుండా.. అవగాహన లేమితో రేవంత్ మాట్లాడిన మాటలు, కర్ణాటక ఎన్నికల ఫలితాలతో వచ్చిన కొద్దోగొప్పో ఉత్సాహాన్ని సైతం నీరుగార్చాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. రేవంత్ తీరు తమ పార్టీకి నష్టం కలిగిస్తున్నదని వాపోతున్నారు.
వరంగల్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతు సంక్షేమం విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. వ్యవసాయానికి మూడు గంటల కరంటు సరిపోతుందని చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు పూర్తిగా డీలాపడ్డాయి. తెలంగాణలో అన్నదాతల కోసం బీఆర్ఎస్ సర్కారు అన్నీ చేస్తుంటే.. కాంగ్రెస్ ముఖ్యనేత రేవంత్రెడ్డి దీనికి విరుద్ధంగా మాట్లాడడం సొంత పార్టీలోనే అయోమయం సృష్టించింది. సాగుకు ఉచిత కరంటుపై పరిమితి ఉండాలని రేవంత్రెడ్డి మాట్లాడడం కాంగ్రెస్కు శాపంగా మారిందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. రైతుల అవసరాలు తెలియకుండా, అవగాహన లేమితో రేవంత్ మాట్లాడారని చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో వచ్చిన కొద్దోగొప్పో ఉత్సాహం కూడా టీపీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలతో పూర్తిగా నీరుగారిపోయిందని చెబుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను ప్రకటిస్తున్నారని, ఇది పార్టీకి తీవ్రంగా నష్టం చేస్తున్నదని సీనియర్ నేతలు వాపోతున్నారు. 24 గంటల ఉచిత కరంటు, రైతు బంధు, రైతు బీమా, ఎంఎస్పీకి పంటల కొనుగోలు వంటి విధానాలతో రైతులు పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వంతో మమేకమయ్యారని, రేవంత్రెడ్డి కరంటు మాటలతో ఇప్పుడు రైతులంతా కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సైతం రేవంత్రెడ్డి కరంటు మాటలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. రైతు సంక్షేమంలో ఇప్పటికే విశ్వసనీయత లేకుండా పోయిన కాంగ్రెస్కు, రేవంత్రెడ్డి మాటలు బాగా నష్టం చేశాయని అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ఆ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న రైతులు రేవంత్రెడ్డి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కరెంట్ కోతలు పెడితే రైతులు వాతలు పెడుతరు
రాయపర్తి, జూలై 14 : ‘తెలంగాణ ఒచ్చిన కాన్నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కరంట్ తిప్పలు తప్పించిండు. పంటలకు 24గంటల పాటు ఉచితంగా కరంటు యివ్వడంతో రైతులు తీరొక్క పంటలు పండించుకుంటాండ్లు. కరంట్ ఫుల్లుగా రావడం షురూ అయినప్పటి నుంచి ఎవుసాయదారులకు ఎసోంటి రందీ లేకుండాపోయింది. పొద్దాంక పొలాలు, చెలుకలు పారిచ్చుకుని తెల్లందాక ఇండ్లళ్ల ఉంటానం. రాత్రిపూట బాయిల కాడికి పోవుడు లేక కరంట్ షాక్లు, పాములు, తేళ్లు కరిచి సచ్చిపోవుడు బంద్ అయింది. కేసీఆర్ సర్కారు పరిపాలనల జర ఇప్పుడిప్పుడే ఎవుసం మంచిగైతాంది. మళ్లా కాంగిరేస్సోళ్లు ఎవుసాయానికి 3గంటలే కరంటు యిత్తామంటే మట్టుకు ఊరుకునేది లేదు. ఆ మూడు గంటల కరెంటిత్తే మూడు కోండ్రల భూమి సుత పారదు. రెక్కల కష్టం చేసి ఏసిన పంటలు కండ్ల ముందట కరంట్ లేక ఎండిపోతాంటే రైతుల పాణం సూసుకుంట ఊకుంటదా?. ఇంతకుముందు కాంగీరేసోళ్ల పాలనల ఎవుసాయానికి 7గంటల పాటు కరంట్ యిత్తానమని చెప్పి.. పొద్దాంక 3 గంటలు, తెల్లందాంక 4గంటల కరంట్ యిచ్చేది. దాంతోటి పొలాలు పారక, పంట భూములు తడువక రైతులు అరిగోస పడేది. అచ్చిరాని కరంట్తోటి మోటార్లు, స్టాటర్లు, డీబ్లు (ట్రాన్స్ఫార్మర్లు) కాలిపోయేది. ఆయిటి పూనిన కాన్నుంచి మొదలుకుంటే రైతులంతా మోటార్లు, డీబ్లు, స్టాటర్లు పట్టుకుని మెకానిక్ల సుట్టూ తిరుగుడే ఉండేడిది. అచ్చిపోయే కరంట్తో ఏగలేక బాయిల కాడ బుగ్గలు పెట్టుకుని కావలి పండేవాళ్లం. అంతేగాక స్టాటర్లన్నింటికీ ఆటోమోటిక్ స్టాటర్లు పెట్టుకునేది. కానీ తెలంగాణల కేసీఆర్ సర్కారు అచ్చినంక ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవుసాయానికి యిచ్చే కరంట్ల కోతలు పెడుతే మాత్రం ఇప్పుడు పచ్చని పంటలు ఉన్న భూముల్లన్నిటిల పల్లేరు కాయలు మొలుసుడు ఖాయం. ఊళ్లపొంటి పంటలు పండకపోతే రైతు కుటుంబాలన్నీ పొట్ట చేతబట్టుకుని ఉప్పర పని చేసేటందుకు మళ్లా పట్నాలకు బతుకపోవుడు అయితది’ అని కుండబద్దలు కొట్టి చెప్పాడు.
రైతులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి వ్యవసాయాన్ని, గ్రామీణ ఆర్థికరంగాన్ని బలోపేతం చేసేలా సీఎం కేసీఆర్ వివిధ పథకాలను, విధానాలను అమలు చేస్తున్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నారు. ఉచితంగా 24 గంటలు కరంటు ఇస్తున్నారు. పెట్టుబడి కోసం రైతు బంధు, రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రైతు బీమా అమలు చేస్తున్నారు. పండిన పంటను సొంత ఊరిలోనే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ అనుకూల విధానాలతో సాగురంగంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. రైతుల కోసం ప్రభుత్వం చేసే పనుల కంటే మరింత మెరుగ్గా ఉండే విధానాలను అమలు చేస్తామని చెప్పాల్సిన ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవసాయరంగాన్ని పూర్తిగా కుదేలు చేసేలా మాట్లాడడంపై ఇప్పుడు అన్నదాతల్లో చర్చ జరుగుతున్నది. వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండగ చేస్తుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు అడుగుజాడల్లోనే నడుస్తూ వ్యవసాయం దండుగ అనేలా మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. 24 గంటల ఉచిత కరంటు వద్దని చెప్పిన వ్యక్తి అధ్యక్షుడుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మనుగడ ఉండదని చెబుతున్నారు. ఉచిత కరంటు విధానాన్ని రద్దు చేసేలా మాట్లాడిన రేవంత్రెడ్డి ఎప్పటికీ రైతు వ్యతిరేకిగానే మిగిలిపోతారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయరంగం ఎంతో పురోగతి సాధించిందని, రేవంత్రెడ్డి ప్రకటనలు దీనికి విరుద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు. రైతు వ్యతిరేక విధానలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ను ఎవరూ ఆదరించరని అభిప్రాయపడుతున్నారు.
గంట కరంటుతోని 10గుంటలు పారియ్యి
హనుమకొండ సబర్బన్, జూలై 14 : నాలుగైదేండ్ల పట్టి కేసీఆర్ సార్ ఇచ్చిన కరంటుతోని ఇంతంత పంట పండించుకొని పోరగాండ్లను సాదుకుంటానం. సక్కగా సాగే సంసారంల పుల్లలు పెట్టినట్టు రేవంత్రెడ్డి సారూ మాట్లాడుడు మంచిగ లేదు. నీకు ఎవుసం గురించి తెలిత్తే నువ్వు ఇత్తానన్న గంటకు ఎకురం పారుడు కాదు, 10గుంటలు పారిచ్చి సూపెట్టు. తెలంగాణ రాక మునుపు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల సంగతి చూసి అప్పట్ల బతుకుడే కట్టంగ ఉండేది. అసలే నీళ్లు తక్కువగా ఉండేది. ఉన్న నీళ్లతోని ఇంతంత పంట పండించుకుందామంటే కరంటు సక్కగా ఉండేది కాదు. ట్రాన్స్పారాలు కాలుడు, గంటకోసారి పీసులు పోవుడు అయ్యేది. పీజు ఏసేందుకు కూడా కరంటోళ్లు ఒక్కడు కూడా ఉండేటోడు కాదు. ఇప్పుడు ట్రాన్స్ఫారం కాడికి పోవుడవసరమే ఉంటలేదు. పీజు పోయినా ఫోన్ చేస్తే వచ్చి ఏశి పోతాండ్లు. కేసీఆర్ ఇచ్చిన ఈ కరంటు వల్లనే మంచిగ పంటలు పండుతానయ్. తెలంగాణ రాష్టం రాకమునుపు మొగులును నమ్ముకొని పంటలు పండిచ్చేది. వాన దేవుడు కరునిత్తే పండినట్టు లేకపోతే ఎండినట్టుగా ఉండేది. పంట ఇంటికొచ్చే దాకా నమ్మకం ఉండేది కాదు.
– గూడెపు సమ్మయ్య, రైతు, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా
నమస్తే తెలంగాణ : రేవంత్రెడ్డి 24 గంటల కరెంటు అక్కర లేదు. మూడు గంటలు చాలని చెప్పిండు మీరేమంటారు?
రైతు : రైతులకు మూడు గంటల కరంటు సాలన్న రేవంత్రెడ్డొచ్చి పొలాలు పారియ్యాలె. రైతులు సల్లగ బతుకుతున్నరు. కాంగ్రెస్కు ఓటేస్తె రైతుల బతుకులు ఆగమే. ఇవేం మాటలు. రేవంత్రెడ్డి మాటలతోని కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడ్డది. తెలంగాణ వచ్చినంక నీళ్లు, కరంటు పుష్కలం అయినయ్. పడావుపడ్డ ఎగుసాలు సాదుమీదికి వచ్చినయ్. దేశంలేని పథకాలు రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరంటు, పుష్కలమైన నీరు. ఇదంత కేసీఆర్ మహిమనే అని ప్రజలు నమ్ముతున్నరు. కేసీఆర్ చేసిన మంచి చెడు జనానికి ఎరుక. పిచ్చోళ్లయి రెండుసార్లు గెలిపిచ్చిండ్రా. ఎగుసం అంటే ఎందో తెలియని రేవంత్రెడ్డి అమెరికా పోయి రైతులకు 24గంటల కరంటు అనవసరం అంటడా. ఊళ్లళ్లకు వస్తే గాజులు తొడుగుతరు.
నమస్తే తెలంగాణ : తెలంగాణ రాక ముందు మీ వ్యవసాయం ఎట్లా నడిచింది?
రైతు : అప్పుడు నీళ్లు లేవు, కరెంటు లేదు. నాలుగు బోర్లు వేస్తే రెండు అట్లట్ల పడ్డయ్. పారిన కాడికి దున్ని తిండి మందం పండిచ్చేది. కరెంటు లేక ఆ దున్నిందే సగం ఎండేది. ఆయాల ఇంజన్ పెట్టి పారిచ్చినం. కరెంటు కోసం రాత్రింబవళ్లూ స్టార్టర్ కాడ కూసునేది, ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలువదు. ఒక్క కారు పండితె మహా ఎక్కువ. ఆ రోజులు రావద్దు సారూ. ఆంధ్రోళ్ల పాలన పోయిందనుకుంటె మళ్ల రేవంత్రెడ్డి చంద్రబాటలనే నడుస్తుండు. మళ్ల వ్యవసాయాలు బంజేసి పట్నం బాట పట్టాలె.
నమస్తే తెలంగాణ: మరి తెలంగాణ వచ్చినాక ఎట్లుంది?
రైతు : తెలంగాణ వచ్చుడొచ్చుడే కేసీఆర్ 24గంటల కరెంటు ఇచ్చిండు. దేవాదుల నీళ్లతోని చెరువులు నింపిండు. చెరువుల నీళ్లుంటె బోర్లు ఫుల్లు పోస్తయ్. ఈ 9 ఏండ్ల నుంచి ఉన్న కాడికి నాటు పెడుతున్నం. నేనొక్కణ్నే కాదు. ప్రతి రైతు గుంట భూమి వదలకుండ నాటు పెడుతుండు. పట్నం బతుకపోయిన వాళ్లు వచ్చి వ్యవసాయాలు చేసకుంటుండ్రు. ఇంత సౌలత్ ఏ గవర్నమెంటు కూడ చేయలె, 24గంటల కరెంటు, రైతు బంధు పెట్టుబడి, రైతుబీమా.. ఇన్ని చేసిన ముఖ్యమంత్రి ఉన్నడా. కేసీఆర్ను విమర్శిస్తే రైతును విమర్శించినట్టే. ఈ ప్రభుత్వం నాలుగు కాలాల పాటు ఉండాలనేదే జనం మాట
నమస్తే తెలంగాణ : మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల పరిస్థితి ఏమిటి?
రైతు : ఇగో కేసీఆర్ చేస్తున్న మంచి చెడు జనానికి ఎరుక. కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు చెప్పితే వినేంత పిచ్చోళ్లు కాదు. తెలంగాణను తిప్పుకొచ్చే మొగోడు కేసీఆర్. ఎంతప్పు చేసిండని తీసెయ్యాలె. ధరణి తెచ్చినందుకా, రైతుబంధు ఇస్తున్నందుకా, నీళ్లు తెచ్చినందుకా..? ఎందుకు ఓటెయ్యెద్దు, రేవంత్రెడ్డి చెప్పిన లెక్క చూస్తే కాంగ్రెస్ వస్తే కరెంటు ఇయ్యరని తెలిసిపోయింది. ఎందుకు ఓటెయ్యాలె. తప్పిదారి కాంగ్రెస్ గెలిస్తే మళ్ల గుడ్డి దీపాలు, రాత్రిపూట బాయిలకాడ పండక తప్పనట్టుంది. బీజీపీని గెలిపిస్తే వ్యవసాయం మోటార్లకు మీటర్లు పెడుతరట. రైతులంతా కేసీఆర్ వైపే.
నమస్తే తెలంగాణ : మీకెంత వ్యవసాయం ఉంది, ఏం పండిస్తున్నరు?
రైతు :మా అన్నదమ్ములకు 12 ఎకురాల భూమి ఉంది. 3 బోర్లు నడుస్తున్నయ్, వరి, మిర్చి, పత్తి పెడుతం. 24గంటల కరెంటుతోని పంటలు పండుతున్నయ్, మా అంతల మేం సుఖంగ అప్పులు లేకుండ బతుకుతున్నం. రైతు బంధు రూ.60 వేలు ఠంచన్గ పడుతున్నయ్. పెట్టుబడి ఎల్లుతాంది. సాగునీరు పుష్కలం. వ్యవసాయానికి కరెంటు నీళ్లు ఉంటె సాలు ఈ రెండు కేసీఆర్ ఇస్తుండు.
నమస్తే తెలంగాణ : మూడు గంటల కరంటుతోని మూడెకరాలు పారుతుందా?
రైతు : మామిడితోటా, వరి పంటా చెప్పలే మరి. రేవంత్రెడ్డి వ్యవసాయం చేసిండా. ఆయనకేం తెలుసు. వరికి ఎంత నీరు కావాలె. పంట పండేదాక మూడించుల నీళ్లు ఉండాలె పొలం. మూడు గంటల కరెంటుతోని మూడెకురాలు పారుతదని ఏ లెక్కన చెప్పిండో ఆయన రైతులకు చెప్పాలె. ఎవరన్న చెప్పితె అంటుండా. కంప్యూటర్ మీద కొట్టి చెబుతుండా ఏందీ.
రేవంత్రెడ్డొచ్చి పొలాలు పారియ్యాలె
దేవరుప్పుల, జూలై 14 : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్తు, సన్న, చిన్నకారు రైతుల వ్యవసాయాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై తెలంగాణ రైతాంగం నిప్పులు చెరుగుతోంది. తెలంగాణ రైతాంగం, వ్యవసాయం సుభిక్షంగా ఉన్న ఈ తరుణంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటును ఎద్దేవా చేస్తూ మూడు గంటల్లో మూడెకరాలు పారుతుందని, 24 గంటల కరెంటు అక్కరలేదని అమెరికాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్పై విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇదే అమలవుతుందని రైతాంగం భావిస్తున్న ఈ దిశలో ‘నమస్తే తెలంగాణ’ సీతారాంపురం గ్రామానికి చెందిన ఓ ముస్లిం రైతును కదిలించగా ఆయన స్పందన ఇది.
– మహ్మద్ అఫ్జల్, రైతు, సీతారాంపురం, జనగామ జిల్లా
కేసీఆర్ వచ్చింనకనే కరంటు కష్టం తీరింది..
మహదేవపూర్, జూలై 14 : మాకు వ్యవసాయమే జీవనాధారం. నాకు ఎనిమిదెకరాల భూమి ఉంది. అందులో మూడెకరాలు పొలం, ఐదెకరాలు మిర్చి సాగు చేత్తన్న. రైతులకు కరెంటు కష్టాలు తీర్చిన దేవుడు సీఎం కేసీఆర్. ఇంతకుముందున్న సర్కారోళ్లు రైతులను పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంల సాగు కోసం కరెంటు సరిగ లేక శాన ఇబ్బందిపడ్డం. రాత్రి ఒంటి గంటకు కరెంటు కోసం బాయిల కాడికి పోయేది. కావలి ఉన్న టైంకు కరెంటు రాక మస్తు తిప్పలు పడేది. వచ్చినా గంట, రెండు గంటలే ఉండేది. సాగుకు సరిపడా నీళ్లు అందక పంటలు ఎండిపోయేది. ఎన్నో తిప్పలు పడినా కరెంటు కష్టాలతో పంటకు సరిగ నీళ్లందక నష్టపోయేది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ రైతు కష్టం తెలుసుకున్నడు. కరెంటు, సాగునీటికి ఇబ్బంది లేకుంట చేశిండు. నిరంతర విద్యుత్ ఇయ్యడం వల్ల మాకు కరెంటు కష్టాలు తీరినయ్. గతంలో పడ్డ గోసలు తప్పినయ్. ఇదివరకు ఏ ప్రభుత్వాలు కూడా రైతుల గురించి ఆలోచన చేయలే. సీఎం కేసీఆర్ రైతుల బాధలు తెలుసుకొని అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటాండు. కాంగ్రెస్ హయాంలో రైతుల సమస్యలపై ఆలోచన చేయలే. ఇప్పుడేమో రేవంత్రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతాండు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని, రేవంత్రెడ్డి బొందపెడం. రైతు బాధలు అర్థం చేసుకోకుండా మాట్లాడుడు బందు చేయాలె. లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతరు. అయినా రైతులెవరూ రేవంత్ మాటలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ నాయకుల మాయ మాటలు మేము నమ్మతలేము నమ్మం. అధికారం కోసం తప్ప కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి రైతులపై చిత్తశుద్ధి లేదు. మా రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్. ఎల్లవేళలా ఆయనకు రుణపడి ఉంటం.
– మలహల్ రావు, రైతు, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్ మండలం
పాలకుర్తి, జూలై 14 : సమైక్యపాలనలో కరెంట్ లేక మస్తు ఇబ్బందిపడేది. ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెల్వక ఆగం అయ్యేది. కరెంట్ కోసం పొలాలు, చేన్ల కాడ కావలి ఉండేళ్లం. వచ్చిన కరెంట్ తడి కూడా ఆరక వేసిన పంటలు ఎండిపోయేది. చేసిన కష్టం కరంట్ బిల్లుకే సరిపోయేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంక రైతులకు మంచిరోజులు వచ్చినయ్. ఉచిత కరంట్తో రైతులకు వరంలా మారింది. కరెంట్ గురించి ఆలోచన లేకుండా చేసిండు కేసీఆర్. వరి, పత్తి పంటల సాగుకు కరెంట్ ఎంతో ఉపయోగపడుతాంది. ఎకరానికి కనీసం ఐదు గంటలు పూర్తిగా పారుతాంది. నాడు కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడేటోళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతును రాజు చేయాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు అనేక పథకాలు అమలుచేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ పథకాలు పెట్టి రైతులకు మేలుచేస్తున్నడు. చివరికి వడగండ్ల వర్షానికి పంట నష్టం పోయిన రైతులకు కూడా పరిహారం ఇస్తున్నడు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు ఉచిత కరెంట్తో రైతులు ధీమాతోటి ఉన్నరు. 24గంటల పాటు కరంటు వస్తున్నది.
రేవంత్రెడ్డికి ఎవుసం చేస్తే తెలుస్తది
భూపాలపల్లి టౌన్, జూలై 14 : కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి చెప్పినట్టు గంట కరంటుతోటి దొయ్య కూడా పారది. ‘గంటకు ఎకరం పారుద్ది.. మూడు గంటలల్ల మూడెకరాలు పారుద్ది.. 24గంటల ఉచిత కరంటు ఎందుకు’ అనే మాటలు ఆయన ఎవుసం చేస్తే తెలుస్తది. నీళ్లు మంచిగ వస్తే గంటకు 20గుంటల భూమి కంటే ఎక్కువ పారది. భూముల స్వభావాన్ని బట్టి పారకంల తేడా ఉంటది. ఎట్లచూసినా గంటల ఎకరం పారుడు కష్టమే. కాంగ్రెస్ గవర్నమెంటు ఉన్నప్పుడు కరంటు ఎప్పుడస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వకపోయేది. గా వచ్చే కరంటు కోసం రాత్రింబవళ్లు కావలి ఉన్నం. మోటర్ల కాడ పడుకున్నం. ఒడ్ల పొంట పాములు, తేళ్లు వచ్చేటియి. విషపురుగులు కుట్టి ఎంతోమంది సచ్చిపోయిన్రు. వచ్చే కరంటు సరిపోక, నీటి పారకం లేక భూమిని సాగు చేసుకోలేక వదిలేసినం. నీళ్లు పారిన కాడికే సాగు చేసినం. చాలా నష్టం జరిగింది. కేసీఆర్ సారు వచ్చిన తర్వాత 24గంటలు ఉచిత కరంటు ఇచ్చి ఆదుకున్నడు. పుష్కలంగా నీళ్లందడం వల్ల ఉన్న భూమంతా సాగులోకి వచ్చి ఏటా రెండు పంటలు పండిస్తున్నం. కాంగ్రెసోళ్లు ఉచిత కరంటు ఇస్తమని వాగ్దానాలు చేస్తున్నరు. మరి రేవంత్రెడ్డి మూడు గంటలే చాలంటున్నడు. ఏందో వాళ్లకే తెల్వాలె..
-ఉప్పుల రమేశ్, రైతు, గొర్లవీడు, భూపాలపల్లి