న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయడం లేదు అన్నదానిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) క్లారిటీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా పార్టీ తరపున ప్రచారం చేయడంపై దృష్టి పెట్టాలని భావించినందుకే అని తెలిపారు. ఒక టీవీ ఛానెల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి ఆమె మాట్లాడారు. సోదరుడైన రాహుల్ గాంధీతోపాటు తాను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే అది బీజేపీకి లాభం చేకూర్చుతుందని ప్రియాంక గాంధీ అన్నారు. ‘నేను గత 15 రోజులుగా రాయ్బరేలిలో ప్రచారం చేస్తున్నా. గాంధీ కుటుంబానికి రాయబరేలీతో ఎంతో అనుబంధం ఉంది. అందుకే మేం ఇక్కడికి వచ్చి వారిని కలిసి మాట్లాడాలని ప్రజలు భావిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఎన్నికలను గెలువలేం’ అని అన్నారు.
కాగా, తోబుట్టువులైన తామిద్దరం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, కనీసం 15 రోజులు తమ నియోజక వర్గాల్లో ప్రచారానికి సమయం కేటాయించాల్సి ఉంటుందని ప్రియాంక గాంధీ తెలిపారు. అప్పుడు దేశమంతటా ప్రచారం చేయడం కుదరదని తాము భావించినట్లు చెప్పారు. అయితే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆమె సరైన సమాధానం ఇవ్వలేదు. ఎన్నికల్లో పోటీ చేయాలని తానెప్పుడూ అనుకోలేదన్నారు. అయితే పార్టీ కోసం వారు ఏం చేయమంటే అది చేస్తానని, తాను ఎన్నికల్లో పోరాడాలని ప్రజలు భావిస్తే పోటీ చేస్తానని ఆమె అన్నారు.
మరోవైపు అమేథీ, రాయ్బరేలీలో పోటీ నుంచి పారిపోతున్నారంటూ బీజేపీ చేస్తున్న విమర్శలను ప్రియాంక గాంధీ ఖండించారు. అమేథీ, రాయ్బరేలీలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వదిలిపెట్టదని తెలిపారు. కాంగ్రెస్, ఈ రెండు నియోజకవర్గాల మధ్య సంబంధాలు భిన్నమైనవని అన్నారు. గుజరాత్లోని వడోదరలో మోదీ ఎందుకు పోటీ చేయడం లేదని ఆమె నిలదీశారు. ‘ప్రధాని మోదీ భయపడుతున్నారా? 2014 తర్వాత వడోదరలో ఎందుకు పోటీ చేయలేదు? గుజరాత్ నుంచి ఆయన పారిపోయారా?’ అని ప్రశ్నించారు.